దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను సడలిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయమై మే 3 తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అయితే కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాలలో జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయని ఆయన ముఖ్యమంత్రులతో సంతోషం వ్యక్తం చేశారు.
కరోనాపై లాక్డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ లాక్డౌన్ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని, వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని, ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయని0 తెలిపారు.
లాక్డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల విభజన చేసుకోవాలని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు. అయితే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడగింపు వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. వారు ఒడిశా, గోవా, మేఘాలయ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు.
కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని సూచించారు. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుందని చెబుతూ అందుకే మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలని స్పష్టం చేశారు.
దేశం ఇప్పటికే 2 లాక్డౌన్లు చూసిందని అంటూ ఇక ముందు ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని సూచించారు. హాట్స్పాట్ – రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
కాగా, వైరస్ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు. గ్రీన్జోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి.. రెడ్జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే లాక్డౌక్ కారణంగా ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడటంతో.. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు.