Site icon OkTelugu

జగన్ కు సవాల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు!

అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు సవాల్ గా మారే అవకాశం ఉంది. గత ఏడాది అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆయన పట్ల ప్రజలలో వచ్చిన మార్పుకు ఈ ఎన్నికలు సంకేతం కాగలవు. ముఖ్యంగా ఆయన పరిపాలనకు ఒక పరీక్షగా మారనున్నాయి.

అయన ప్రభుత్వం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటు పడటం, పోలవరం వంటి ప్రాజెక్ట్ లు ఆగిపోవడం వంటి అంశాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయని ఆసక్తి నెలకొంటుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ఒక విధంగా నిస్సహాయ స్థితిలో, ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించక పోయినా అధికార పక్షం వైఫల్యాలే తమకు వరంగా మారగలవాని ఆశతో ఉన్నారు.

పలు జిల్లాల్లో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు కూడా వేయడకుండా అడ్డుకొంటు అధికార పక్షానికి చెందిన వారు దౌర్జన్యాలకు దిగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం గమనిస్తే అధికార పక్ష నేతలలో అసహనం వెల్లడి అవుతున్నది. ఫలితాలు సానుకూలంగా లేని పక్షంలో తామే బాధ్యత వహింపవలసి ఉంటుందని మంత్రులు, ఎమ్యెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది.

ముఖ్యంగా జిల్లాల్లో ఎమ్యెల్యేలు, మంత్రులు, పార్టీలో తొలి నుండి ఉన్న నాయకులు, అధికారమలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన నాయకుల మధ్య సయోధ్య లోపించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. అందుకనే ఎన్నికల ఫలితాలకు మంత్రులే బాధ్యులని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫలితాలు నిరాశాజనకంగా ఉంటె ఆయా మంత్రులు నేరుగా రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేశారు. ఆయన మాటలలోనే పార్టీలో నెలకొన్న పరిస్థితులు వెల్లడి అవుతున్నాయి.

స్థానిక సంస్థలలో స్థానికంగా గల వర్గ రాజకీయాలు ప్రాబల్యం వహించే అవకాశం ఉన్నందున అధికార పక్షంలో నెలకొన్న వర్గాల ప్రభావం ఫలితాలపై ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉంటె వాటి ఫలితం జగన్ నాయకత్వం పైననే పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా కేంద్రంతో సంబంధాల విషయంలో, స్వయంగా సిబిఐ కోర్ట్ లో ఎదుర్కొంటున్న అవినీతి కేసులకు సంబంధించి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ ఎన్నికలు ప్రభుత్వ సుస్థిరతకు కీలకంగా మారే అవకాశం ఉంది.

మంత్రులలో ఐదారుమంది తప్ప తమ తమ జిల్లాల్లోని రాజకీయాలపై అదుపు ఉన్న వారు కాకపోవడం ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పక్షంకే పరిష్టితులు సానుకూలంగా ఉంటూ ఉంటాయి. అటువంటి సానుకూలతను ఏ మేరకు రాజకీయంగా ప్రయోజనకరంగా మార్చుకుంటారో అని చూడవలసి ఉంది.

Exit mobile version