చంపుతామని ఫోన్లు.. బుద్ధా, రాయపాటి ఆరోపణ!

ఒక వంక కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళనతో ఉంటే, మరోవంక వైసిపి నాయకులు తమ అధినేతపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలను చంపివేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు చేయడంలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు చెలరేగడం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతున్నది. “మా నాయకుని జోలికి వస్తారా?.. ప్రేలాపనలు చేస్తారా?.. చంపేస్తాం!” అంటూ తమకు బెదిరింపు ఫోన్లు వచ్చిన్నట్లు ఇద్దరు ప్రముఖ టిడిపి నేతలు బహిరంగంగా పేర్కొనడం సంచలనం కలిగించింది. ప్రభుత్వ అధినేత ధోరణిని ప్రశ్నించినందుకు తమకు ఈ […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 11:15 am
Follow us on


ఒక వంక కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళనతో ఉంటే, మరోవంక వైసిపి నాయకులు తమ అధినేతపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలను చంపివేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు చేయడంలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు చెలరేగడం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతున్నది.

“మా నాయకుని జోలికి వస్తారా?.. ప్రేలాపనలు చేస్తారా?.. చంపేస్తాం!” అంటూ తమకు బెదిరింపు ఫోన్లు వచ్చిన్నట్లు ఇద్దరు ప్రముఖ టిడిపి నేతలు బహిరంగంగా పేర్కొనడం సంచలనం కలిగించింది.

ప్రభుత్వ అధినేత ధోరణిని ప్రశ్నించినందుకు తమకు ఈ విధమైన బెదిరింపులు వస్తున్నాయని టిడిపి ఎమ్యెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వేర్వేరుగా ఆరోపణలు చేశారు. పైగా, గత నెలలోనే స్థానిక ఎన్నికల సందర్భంగా మాచర్లలో తనపై ఒకసారి హత్యాయత్నం జరిగిగినదని వెంకన్న గుర్తు చేశారు.

రాయపాటి విషయంలో అయితే ఆయనను వ్యక్తిగతంగా నిందిస్తూ, ఆయన మరణించినట్లు సోషల్ మీడియా లో కధనాలు వైరల్ గా వ్యాపించాయి.

వివిధ ఫోన్‌ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురువారం రాత్రి మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని విమర్శిస్తున్నానని.. నీ అంతు చూస్తాం.. కేసులలో ఇరికిస్తామంటూ హెచ్చరించారు’ అంటూ తెలిపారు.

`మొన్న మాచర్లలో నాపై హత్యా ప్రయత్నం జరిగింది. మళ్లీ ఇలా ఫోన్‌లో బెదిరించడాన్ని చూస్తే ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అర్ధమవుతోంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలను తట్టుకోలేని వారు వ్యక్తిగతమైన బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

‘420 బ్యాచ్‌ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయుకి వెళ్లిపోయింది. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జైల్లో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్‌, విజయసాయిరెడ్డిలను చూస్తే అర్థమవుతుంది’ అంటూ వెంకన్న ట్వీట్ కూడా చేశారు.

మరోవైపు రాజధానికి మద్దతుగా జేఏసీ నేతలు ఇళ్లల్లో ఉండి చేస్తున్న దీక్షలకు రాయపాటి బుధవారం మద్దతు పలికారు. రాష్ట్రంలో సమర్ధులైన అధికారులను కులం పేరుతో పక్కకు నెట్టేయడం వల్లే రాష్ట్రంలో కరోనా వేగంగా పెరుగుతోందని, కరోనా లెక్కలతో పాటు కులం పేరుతో జగన్‌ పక్కనబెట్టి వారి లెక్కలు కూడా తీయాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ సామాజికవర్గం తీవ్రంగా స్పందిస్తూ పలువురు ఆయనకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇంకోసారి తమ నాయకుడిపై ప్రేలాపనలు చేస్తే చంపేస్తామంటూ హెచ్చరించినట్లు రాయపాటి ప్రకటనలో ఆరోపించారు.

అంతేకాకుండా మొద్దు శ్రీను, మద్దెల చెరువు సూరి వంటి వారి ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టి గతాన్ని మర్చిపోయారా అంటూ రాయపాటికి హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారని రేపటి సన్నిహితులు ఆరోపించారు.