Kanna Laxminarayana : ఏపీ బీజేపీ మాజీ చీఫ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీని వీడేందుకు డిసైడ్ అయ్యారు. అనుచరుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సిద్ధపడుతున్నారు. గత కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కన్నా ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీలపై ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి నడిచింది. ఎక్కడా పార్టీ హైకమాండ్ పెద్దలపై విమర్శలు చేయకుండా… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ లకు అనుకూలంగా మాట్లాడారు. కాపులకు చంద్రబాబే న్యాయం చేశారంటూ ప్రకటన టీడీపీలో చేరేందుకు ఇచ్చిన సంకేతంగా తెలుస్తోంది. దాదాపు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్ధమైపోయారన్న టాక్ నడుస్తోంది.
కన్నా లక్ష్మీనారాయణది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడైన కన్నా రాజకీయాల్లో ప్రవేశించి పిన్న వయసులోనే కీలక పదవులు చేపట్టారు. పెద్ద కురపాడు నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక పోర్టుపోలియోలు నిర్వహించారు. చివరిగా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పదవి చేపట్టారు. రాష్ట్ర విభజనతో …2014లో కాంగ్రెస్ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమితో హైకమాండ్ ఆదేశాలతో పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పదవిని తనకు గిట్టని సోము వీర్రాజుకు అప్పగించడాన్ని కన్నా తట్టుకోలేకపోయారు. సోము వీర్రాజును తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. దీంతో పార్టీ మారడమే ఉత్తమమని భావిస్తున్నారు.
తొలుత ఆయన జనసేనలో చేరుతారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి వచ్చిన పవన్ సమక్షంలో కన్నా జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున పవన్ మొగ్గుచూపలేదని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు కన్నా సెడన్ గా రూటు మార్చారు. జనసేన కాకుండా టీడీపీలో చేరేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. టీడీపీ ఇచ్చిన ఆఫర్ తోనే కన్నా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 24న చంద్రబాబు సమక్షంలో చేరేందుకు మూహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ తో పాటు డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల రివ్యూచేసి వివాదం లేని వాటి అభ్యర్థులను చంద్రబాబు ముందే తేల్చేస్తున్నారు. కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. అది కన్నా లక్ష్మీనారాయణ కోసమేనన్న టాక్ నడిచింది. పశ్చిమ నియోజకవర్గంపై చాలామంది టీడీపీ నేతల కన్ను ఉంది. కానీ చంద్రబాబు ఎవరికీ హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన వెంటనే నియోజకవర్గ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది.