ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ సర్కారు కృష్ణాబోర్డుకు లేఖ రాయడం.. ఈ విషయంలో రెండు రాష్ట్రాల నేతలు మాటల యుద్ధానికి తెరతీయడం.. కృష్ణాబోర్డు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించడం.. అన్నీ జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. పర్యటన కూడా ఖరారైన తర్వాత వాయిదా పడింది.
దీనికి ఏపీ సర్కారు సహకరించకపోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డు కమిటీ సభ్యుల పర్యటనకు భద్రత కల్పించడానికి ముందుకు రాకపోవడంతో.. పరిశీలనను కమిటీ వాయిదా వేసుకుంది. అంతేకాదు.. జూలై మూడవ తేదీన కేంద్ర బలగాల రక్షణతో అక్కడకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి కూడా సమాచారం ఇచ్చింది.
అయితే.. ఈ పరిస్థితి జగన్ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెట్టేదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డు పర్యటనకు సహకరించకపోవడం ద్వారా.. తాము తప్పు చేస్తున్నామని సందేశం ఇచ్చినట్టు అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. పర్యటన కొనసాగితే నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే.. ఏపీ ముందుకు రాలేదని కూడా కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు చేస్తున్న విమర్శలు నిజమేననే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. కేంద్ర కమిటీకి రాష్ట్రం భద్రత కల్పించలేకపోతే.. కేంద్ర బలగాలతో రాష్ట్రంలో పర్యటిస్తే.. జగన్ సర్కారుకు అవమానం కాదా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బలగాలతో పర్యటించి, అక్కడ నిజంగానే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తేలిస్తే.. దేశవ్యాప్తంగా పలుచనైపోవడం జరగదా? అని కూడా అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడు రోజుల్లో కృష్ణా బోర్డు పర్యటన సాగే అవకాశం కనిపిస్తోంది. మరి, బోర్డు పరిశీలనలో ఎలాంటి విషయాలు తెలుస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.