Yerra Gangireddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఎర్ర గంగిరెడ్డికి షాక్

వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో సీబీఐ విచారణను బట్టి అర్థమవుతున్నా, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఇప్పటికే జగన్ సొంత బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరులు ఉదయ్, సునీల్ రెడ్డీలు రిమాండ్ లో ఉన్నారు.

Written By: SHAIK SADIQ, Updated On : April 27, 2023 3:07 pm
Follow us on

Yerra Gangireddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు ఏదో ఒక చోట వచ్చి ఆగిపోతూనే ఉంది. దర్యాప్తుకు ఎవరూ సహకరించడం లేదని పదే పదే సీబీఐ కోర్టుకు విన్నవిస్తుంది. ఈ క్రమంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసి లొంగిపోవాలని కోర్టుకు సూచించింది.

వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో సీబీఐ విచారణను బట్టి అర్థమవుతున్నా, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఇప్పటికే జగన్ సొంత బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరులు ఉదయ్, సునీల్ రెడ్డీలు రిమాండ్ లో ఉన్నారు. అవినాష్ రెడ్డికి పలుమార్లు నోటీసులు అందించింది. నిందితులుగా భావిస్తున్న వారందరినీ వేర్వేరుగా ప్రశ్నిస్తూ సమాధానాలను సరిపోల్చుకుంటుంది. సీబీఐ సంధిస్తున్న ప్రశ్నలన్నీ వివేకా హత్య జరిగినప్పుడు ఏం జరిగింది? సాక్ష్యాలను ఎందుకు చెరిపేయాల్సి వచ్చిందన్న దానిపై ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

హత్య కేసు విచారణను సీబీఐ మొదట్లో అలసత్వం చేసింది. ఏపీ పోలీసులు కూడా తాత్సారం చేశారు. కేసు విచారణ తెలంగాణాకు బదిలీ అయిన తరువాతే ఊపందుకుంది. సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో విచారణ వేగవంతమైంది. ఈ నెలాఖరుకు తేల్చాలని అత్యున్నత న్యాయస్ధానం సూచించింది. అయితే, విచారణ ఒక కొలిక్కి రాకపోవడంతో మరో నెల పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. హత్య కేసులో విషయంలో ముందుగా అదుపులోకి తీసుకొని విచారించింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డిలనే. వీరందరికి కండీషన్డ్ బెయిల్ లభించింది.

వీరిలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కీలకమైనది. వివేకా హత్య కేసులో సూత్రధారి, పాత్రధారి ఇతనేన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వివేకా వెన్నంటే ఉండే ఇతను ఆయన చేసే ప్రతి పనిలో ఉన్నాడు. బెంగుళూరుకు వజ్రాల కోసం తీసుకెళ్లినా, భూ వివాదాల సెటిల్ మెంట్లు చేసినా గంగిరెడ్డి ఉండేవాడు. హత్య ఎందుకు జరిగిందన్న విషయం కూడా ఇతనికి తెలిసే ఉంటుందన్నది సీబీఐ అభిప్రాయం. ఇతను ఇప్పటి వరకు బెయిల్ పైనే ఉన్నాడు. విచారణకు పిలిచిన సందర్భాల్లో సరైన సమాధానాలు చెప్పడం లేదని సీబీఐ వాదిస్తుంది. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన విచారణలో హై కోర్టుకు తెలిపింది. వివేకా హత్య పెద్ద కుట్ర అని, పథక రచన అమలు అంతా ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టుకు తీసుకెళ్లారు. బెయిల్ పై ఇంతకాలం బయట ఉండటం వల్ల సాక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.