మద్యంప్రియులకు కేరళ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. మందుబాబులకు ఆన్ లైన్లో మద్యం సరఫరాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేయడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు మద్యంషాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యానికి అలవాటుపడిన మద్యంప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మద్యం దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్క కేరళలో మద్యం దొరకక ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోగా ఒకరు గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం.
ఈనేపథ్యంలో కేరళ ప్రభుత్వం మద్యం సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని ఎక్సైజ్ శాఖకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మద్యానికి బానిసైన వారికి మద్యం అందేలా చూడాలని ఎక్సైజ్ శాఖను సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. ఈమేరకు అవసరమైతే ఆన్ లైన్ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది.
దీంతో ఇప్పటివరకు మద్యం దొరకక అల్లాడిపోతున్న మద్యంప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం నిర్ణయంపై మద్యంప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాన్ని మరికొన్ని రాష్ట్రాలు అవలంబించేందుకు సిద్ధమవుతున్నాయి.