లాక్ డౌన్ కారణంగా రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, వారి ఇంటికి వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి, వారికి గిట్టుబాటు ధర అందిస్తుందని చెబుతూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బత్తాయి రైతుల విషయంలో మాత్రం చేతులెత్తివేస్తున్నారు. ఆయన ఆదేశాలను స్వయంగా ఆయన మంత్రి, ఉన్నతాధికారులు నిరాకరించడంతో మౌనం వహిస్తున్నారు.
నల్లగొండ, పాలమూరు బత్తాయిలను గ్రేటర్ హైదరాబాద్కు సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు గాలిలో కలిసిపోయాయి. రైతుల నుంచి బత్తాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించడం అసాధ్యమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో సీఎం ఏమీ చేయలేకపోయారు.
రాష్ట్రంలో పండించిన బత్తాయిని ఎగుమతి చేయనీయొద్దని, హైదరాబాద్ వాసుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇక్కడే విక్రయించాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నారు.
‘‘రాష్ట్రంలో బత్తాయి వినియోగం తక్కువ. ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ప్రతి సీజన్లో బత్తాయి ఎగుమతి అవుతుంది. ఈసారి ఇక్కడే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా ఆలోచించాం. కానీ, ప్రస్తుతం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చాం’’అని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
ఇది ఢిల్లీ, ఉత్తరాది మార్కెట్పై ఆధారపడిన అంశమని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే తేల్చాలని అంటూ చేతులెత్తేశారు. ఈ సారి రేటు తక్కువైనా రైతులు ఓర్చుకోవాలి అంటూ వారికి ఓ ఉచిత సలహా ఇచ్చారు. టన్నుకు రూ.40-50 వేల ధర పలికే ఈ సీజన్లో రూ.10వేలకు పడిపోవటం, కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్రం వెనుకడుగు వేయడంతో బత్తాయి రైతులకు దిక్కు తోచడం లేదు.
గత నెల 22 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్నా ఢిల్లీ, కోల్కతా, కర్నూలుకు చెందిన వ్యాపారులు నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల రైతులను ఫోన్లలో సంప్రదించారు. ఎగుమతులకు అనుమతి లేదని రైతులు చెప్పటంతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చటంతో రైతులకు ఏమి చేయాలో అంతుబట్టడం లేదు.