దేశంలో ఉన్న బిజెపి ముఖ్యమంత్రులు అందరిలో ప్రజాబలం గల ఏకైక నేత కర్ణాటక సీఎం బిఎస్ యడియూరప్ప మాత్రమే. ఆ ప్రజాబలమే ఆయనకు సొంత పార్టీ నేతల నుండి తరచూ ముప్పు కలిగిస్తున్నది. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రావడానికి ఆయనే ప్రధాన సూత్రధారి. ప్రజాబలం కూడదీసుకోగల మరో నేత లేరు. అందుకనే 75 సంవత్సరాల వయస్సు దాటినా ఆయనను సీఎంగా చేయక తప్పలేదు.
బీజేపీలో ఇతర ముఖ్యమంత్రులు, కేంద్ర నాయకులు అందరు తెరవెనుక నేతలను ప్రసన్నం చేసుకొని కీలక పదవులలోకి వస్తున్నవారే. అందుకనే ప్రజాబలం ఉన్న కళ్యాణ్ సింగ్, ఉమా భారతి, మదన్ లాల్ ఖురానా, శంకర్ సింగ్ వాఘేలా వంటి నేతలంటే బిజెపి కేంద్ర నాయకత్వం తొలినుండి భయపడుతూ వస్తుంది.
తమకెక్కడ పోటీకి వస్తారో అన్నదే వారి భయం. అదే భయంతో గతంలో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుండి దించడానికి స్వయంగా ఎల్ కె అద్వానీ మంత్రాంగం నడిపారు. ఇప్పుడు మరోసారి అట్టి ప్రయత్నమే జరుగుతున్నది. బొటాబొటి ఆధిక్యతతో ఉన్నప్పటికీ ఆయనను పదవి నుండి దించాలని ప్రతిపక్షాలు ఏవీ పెద్దగా ప్రయత్నం చేయడం లేదు.
కానీ బిజెపి కేంద్ర నాయకత్వంలో కీలకమైన కర్ణాటకకు చెందిన ఒక నేత తెరవెనుక నుండి సీఎంను అస్థిరం కావించడానికి మొదటినుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సహితం మంత్రిపదవులపై సీఎంకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, వారే మంత్రిపదవులు దక్కనివారిని ఆయనపైకి రెచ్చగొట్టడం చేస్తున్నారు.
తాజాగా తనను కేబినెట్లోకి తీసుకోనందుకు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ సీనియర్ నేత ఉమేశ్ కత్తి సీఎం యడియూరప్పపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తన నివాసంలో ఆయన గురువారం కొందరు అసంతుష్ట ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయడం పార్టీలో కలకలం రేపుతున్నది. గత రెండు వారాల్లో విందు భేటీ జరగడం ఇది రెండోసారి.
బెళగావి జిల్లాకు చెందిన ఉమేశ్ కత్తి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నేత. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి తనకివ్వనందుకు ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించేందుకు భేటీ అయ్యామని, అంతకుమించి ఏమీ లేదని ఉమేశ్ చెప్పినా ఎవ్వరు నమ్మడం లేదు. కాగా, యడియూరప్ప రాష్ట్రానికే ముఖ్యమంత్రి అని.. తమకు నాయకుడు కాదని.. తమ నేతలు ప్రధాని మోదీ, అమిత్షా, జేపీ నడ్డా మాత్రమేనని ఈ భేటీలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాళ్ పేర్కొనడం గమనార్హం.