జగన్ బాధ్యతలు స్వీకరించి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకు కొత్త పరిశ్రమ వచ్చిన దాఖలాల్లేవు. పైగా.. అమరావతి వివాదం నేపథ్యంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఏ రాష్ట్రం, దేశం పురోగమించాలన్నా.. సంక్షేమం తోపాటు అభివృద్ధి అత్యంత కీలకం. అదికూడా నిరర్థక అభివృద్ధి కాకుండా.. ఆదాయం సమకూర్చే అభివృద్ధి కావాలి. అప్పుడే ఖజానాకు నాలుగు రాళ్లు సమకూరుతాయి. ఆ ఆదాయం ద్వారా సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు.
కానీ.. ఏపీలో ఇప్పటి వరకూ ఇలాంటి అడుగులు పడకపోవడం గమనించాల్సిన అంశం. సంక్షేమం కోసం ఖజానా ఖాళీ చేస్తే.. రాబడి లేకపోతే.. భవిష్యత్ ఏంటన్నది ప్రశ్న. అప్పులతోనే కాలం వెళ్లదీస్తే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన జగన్.. త్వరలో అమెరికా యాత్ర చేపట్టబోతున్నారని సమాచారం.
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి రావాల్సిందిగా వ్యాపారస్థులను ఆహ్వానించడానికి సమాయత్తమవుతున్నారట. రాబోయే మూడేళ్లలో కొన్ని సంస్థలనైనా ఏపీకి ఆహ్వానించడం ద్వారా.. ఈ లోటును కూడా పూడ్చుకోవాలని చూస్తున్నారట. నిజానికి ఫారెన్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు చాలా మందే ఉన్నారు. రాయితీలు దండిగా ప్రకటించడం ద్వారా వారిని ఏపీకి తీసుకురావాలని చూస్తున్నారట. మరి, ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.