YS Jagan : ఇండియా కూటమిలోకి జగన్.. కాంగ్రెస్, వామపక్షాలతో స్నేహం.. అఖిలేష్ రాయబారం!

ప్రతి రాజకీయ పార్టీకి ఓటమి అనేది ఒక గుణపాఠం. ప్రజాక్షేత్రంలో ఓటమి ఎదురైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం సాధారణం. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది వైసిపి. అందుకే జాతీయ పార్టీల మద్దతు కోరుతోంది. తద్వారా పూర్వ వైభవం చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.

Written By: Dharma, Updated On : July 24, 2024 2:55 pm
Follow us on

YS Jagan : జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? జాతీయ పార్టీల అండ ఉండాలనుకుంటున్నారా? అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నారా? జాతీయస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ హస్తిన బాట పట్టారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మద్దతు తెలపాలని జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కానీ పార్టీల నుంచి స్పందన అంతంత మాత్రమే. ఏపీలో మిగతా పార్టీలు స్పందించలేదు. రాజకీయ స్నేహితుడైన కేసీఆర్ పార్టీ సైతం పెద్దగా మొగ్గు చూపులేదు. కానీ అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ ధర్నాకు సంఘీభావం తెలపడం విశేషం. తద్వారా కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడ్డాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా ఇండియా కూటమిలోకి ఎంట్రీకి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల దృష్ట్యా అఖిలేష్ సాయాన్ని జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎంపి స్థానాలను సాధించింది. భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అఖిలేష్ యాదవ్ జగన్ కు స్నేహ హస్తం అందించినట్లు తెలుస్తోంది. ఏపీలో మిగతా రాజకీయ పక్షాలు జగన్ తో కలిసేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. టిడిపి, బిజెపి,జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే సమన్వయంతో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ఏపీలో మిగతా రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్లాలంటే.. ఇండియా కూటమిలో చేరడం శ్రేయస్కరమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ధర్నా
కేంద్రంతో పాటు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏకు వ్యతిరేకంగా వెళుతున్నట్టే. దేశంలో చాలా పార్టీలకు సమాచారం ఇచ్చారు. మద్దతు కోరారు. కానీ ఎన్డీఏ పక్షాలు మద్దతు తెలిపే ఛాన్స్ లేదు. కానీ అనూహ్యంగా ఇండియా కూటమిలోని సమాజ్ వాది పార్టీ ముందుకొచ్చింది. సంఘీభావం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని మోదీ, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అఖిలేష్. ఎన్డీఏ కూటమి అంటేనే అల్లంత దూరంలో ఉంటారు. అటువంటి అఖిలేష్ నేతృత్వంలోనే సమాజ్ వాది పార్టీ జగన్ కు మద్దతు తెలపడం వెనుక చాలా కథ నడిచినట్లు సమాచారం. ముఖ్యంగా జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ మీడియా సైతం ఇదే స్పష్టం చేస్తోంది.

* బిజెపి వ్యతిరేకి మద్దతు
ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా సమాజ్ వాది పార్టీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువ ఎంపి స్థానాలను దక్కించుకుంది. బిజెపికి యూపీలో చావు దెబ్బతీసింది. బిజెపి సొంతంగా అధికారంలోకి రాకుండా చేయడంలో సమాజ్ వాది పార్టీ సక్సెస్ అయ్యింది. అటువంటి సమాజ్ వాది పార్టీ మద్దతును జగన్ కూడగట్టారు. ఇది కచ్చితంగా కేంద్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించే విషయమే. అయితే ముందస్తు వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* కేంద్ర పెద్దలు సహకరించరు
ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి వైసిపికి సహకరించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసిపి అవసరం ఉన్నా.. కొద్ది రోజుల్లో రాజ్యసభలో ఎన్డీఏ ప్రాతినిధ్యం పెరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటనుంది. మరోవైపు లోక్ సభలో టిడిపి కింగ్ మేకర్ గా ఉంది. ఎన్డీఏకు బలమైన పక్షంగా నిలిచింది. ఏపీలో టిడిపికి బద్ద విరోధిగా ఉన్న జగన్ కు సహకరించే స్థితిలో బిజెపి లేదు. అందుకే ఈ పరిణామాలన్నింటినీ ఆలోచించిన జగన్ సాహసం నిర్ణయానికి వచ్చారు. అఖిలేష్ ద్వారా ఇండియా కూటమిలో అడుగుపెట్టి.. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల స్నేహ హస్తాన్ని అందుకునేందుకు ఈ ప్రయత్నాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.