spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan AP Employees : ఉద్యోగులను వదిలిపెట్టని జగన్

Jagan AP Employees : ఉద్యోగులను వదిలిపెట్టని జగన్

Jagan AP Employees : ఉద్యోగుల కళ్లలో ఆనందం.. వారి పెదవులపై చిరునవ్వు చూడాలి. వారికి అందించాల్సిన ప్రయోజనాలు కల్పిస్తే పాలనలో మెరుగైన సేవలందిస్తారంటూ విపక్ష నేతగా జగన్ ప్రకటించేసరికి వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతులేని విజయం కట్టబెట్టారు. వైసీపీకి అనధికార ప్రతినిధులుగా మారిపోయి ఊరూవాడా ప్రచారం చేసిన వారూ ఉన్నారు. తాము ఓటు వేయడమే కాదు. పది మందితో ఓటు వేయించి జగన్ తీయని వ్యాఖ్యలకు రుణం తీసుకున్నారు. అటు అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో సచివాలయ ఉద్యోగులతో సమావేశమైన జగన్ అందరం కలిసి పనిచేసుకుందాం.. మీ కాలికి ముల్లు గుచ్చుకున్నా తీస్తా.. ఇది మనందరి ప్రభుత్వం.. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత బాగా పనిచేస్తారు.. అనేసరికి తెగ సంబరపడిపోయారు. ఇక తమకు తిరుగులేదని భావించారు. తొలి మూడేళ్లు భ్రమల్లో బతికేశారు. నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి అసలు విషయం తెలుసుకున్నారు. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం సాధించలేకపోయామన్న బాధ, ఆవేదన వెరసి.. తమను ఇంత నమ్మించి మోసం చేస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు.

అటు జగన్ కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులు తన నుంచి దూరమయ్యేసరికి తనలో ఉన్న అపరిచితుడ్ని బయటకు తీశాడు. వారిని ఎంత ఇబ్బందిపెట్టాలో అంతలా పెడుతున్నారు. లక్షలాది రూపాయల జీతాలు ఉన్న మీకు ఇంకా ఆర్థిక ప్రయోజనాలు అవసరమా? అన్నట్టు ఉన్నవాటికి కోత విధించారు. పీఆర్సీని నియంత్రించారు. డీఏల విషయంలో మోసం చేశారు. జీతాలు సమయానికి ఇవ్వడం లేదు.. వారు దాచుకున్న డబ్బులనూ వదలడం లేదు. ఉపాధ్యాయుల విషయంలో చెప్పనక్కర్లేదు. వారికి జీతాలు దండగఅన్న రీతిలో వ్యవహరించిన సందర్భాలున్నాయి.

అయితే తాజాగా ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారని భావిస్తున్నట్టున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తరహాలో ఉద్యోగుల పనితీరును తనిఖీ చేసేందుకు స్వ్కాడ్ ను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు ముఖ హాజరు తీసుకొచ్చారు. ఉదయం విధుల్లో చేరినప్పుడు.. కార్యాలయం నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ఫేసియల్ రికగ్నేషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఏకంగా తనిఖీలకు స్క్వాడ్ ను ఏర్పాటుచేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

అప్పుడెప్పుడో చంద్రబాబు పంచ్ సిస్టమ్ తీసుకొస్తే ఉద్యోగులు తెగ రగిలిపోయారు. ఇప్పుడు ముఖ హాజరు..ఆపై నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇక పనిచేయని ఉద్యోగులను ఫ్లయింగ్ స్వ్కాడ్ పట్టుకుంటారన్న మాట. ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఇంతలా కక్ష పెట్టుకున్నారెందుకో తెలియడం లేదు. ఇప్పటికే తనకు దూరమైన వర్గంగా ఉన్న ఉద్యోగులను ఎందుకు ఉదాసీనంగా విడిచిపెట్టాలని భావిస్తున్నట్టున్నారు. అందుకే వారినే టార్గెట్ చేస్తూ కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు జరిగినా.. వారు గుర్తించలేకపోయారు. జగన్ తీయని మాటలకు పడిపోయారు. అటు జగన్ కూడా తనకు మద్దతుగా నిలిచిన వారికి ప్రయోజనాలు కల్పించకపోగా.. తిరిగి వారిపైనే దండయాత్రకు దిగడం మాత్రం ప్రతికూలాంశంగా మారిపోతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version