భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డారు ఈటల రాజేందర్. ఆ తర్వాత కేసీఆర్ తీరుపై భగ్గుమని ఆయనను వ్యతిరేకించేవారిని వరుసగా కలుసుకున్నారు. ఇక సొంత పార్టీ పెట్టడమా? బీజేపీలో చేరడమా? అన్నదానిపై మల్లగుల్లాలు పడ్డారు.
అయితే తాజాగా ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉండడం విశేషం. బీజేపీలో చేరుతారన్న ఊహానాల నేపథ్యంలో ఈటల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
ఈటల రాజేందర్ తోపాటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. కరీంనగర్ లో ఆలస్యం కావడంతో రేపు ఢిల్లీ వెళ్లనున్నాడు.
కాగా.. ఈటల రేపు ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీలో ఈటల రాజేందర్ కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రెండురోజులుగా తర్జన భర్జనల తర్వాత టీఆర్ఎస్ దాడిని ఎదుర్కోవాలంటే.. ఉన్న ఆస్తులపై విచారణను తప్పించుకోవాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఉత్తమమని ఈటల డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరేందుకు ఈటల వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది. రేపటి వరకు దీనిపై క్లారిటీ రానుంది.