
సీఎం కేసీఆర్ పై తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గర్జించారు. తన సొంత ఇలాకాలో ఈరోజు పర్యటించిన ఈటల రాజేందర్ వేల అభిమానుల మధ్య కేసీఆర్ తో సవాల్ వేశారు. ఎత్తిన జెండా.. బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని ఈటల రాజేందర్ తొడగొట్టారు.
టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఈటల ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటించారు. కమలాపూర్ మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్రబిందువు అని.. ఎత్తిన జెండా బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని ఈటల అన్నారు. ఆనాడు సింహగర్జనకు కరీంనగర్ ఎలా తొలి పలుకు పలికిందో.. నేడు హుజూరాబాద్ కూడా ఆత్మగౌరవ పోరాటానికి అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమకోసం ఉద్యమక్షేత్రంగా మారనుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్దిచెబుతామని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్పారని.. ఎన్నికల్లో తన విజయానికి భరోసా ఇచ్చారని తెలిపారు.
హుజూరాబాద్ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని ఈటల ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరుగనుందన్నారు. కొంత మంది వ్యక్తులు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ది చెబుతామన్నారు.