Homeఆంధ్రప్రదేశ్‌Y V Subba Reddy: విశాఖ? ఒంగోలా? డైలమాలో వైవి సుబ్బారెడ్డి

Y V Subba Reddy: విశాఖ? ఒంగోలా? డైలమాలో వైవి సుబ్బారెడ్డి

Y V Subba Reddy: వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా? హై కమాండ్ ఆదేశించిందా? ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్న వై వి సుబ్బారెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జి గా ఉన్నారు. టీటీడీ అధ్యక్ష పీఠంతో పాటు ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలను చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో టీటీడీ పదవిలోకి కరుణాకర్ రెడ్డిని కూర్చోబెట్టారు. వైవి సుబ్బారెడ్డి ని ఉత్తరాంధ్ర ఇన్చార్జిగానే పరిమితం చేశారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని వై వి ప్రకటించడంతో రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

వైవి సుబ్బారెడ్డి సీఎం జగన్ కు సమీప బంధువు. బాబాయ్ అవుతారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు.అయితే 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఆయన స్థానంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వై వి సుబ్బారెడ్డికి టీటీడీ అధ్యక్ష పీఠం దక్కింది. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న వై వి సుబ్బారెడ్డిని ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

వైవి సుబ్బారెడ్డి చూపు ఒంగోలు ఎంపీ స్థానం పై ఉంది. అక్కడ నుంచి మరోసారి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి అడ్డుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో వై వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూస్తున్నారు. అయితే హై కమాండ్ మాత్రం వై వి సుబ్బారెడ్డికి పెద్దపీట వేస్తోంది. ఇది బాలినేనికి మింగుడు పడడం లేదు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన సైతం వై వి సుబ్బారెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని వై వి సుబ్బారెడ్డి తన అనుచరుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తాను కాకుంటే కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారు. బాలినేని తో పాటు విజయసాయిరెడ్డి సైతం మాగుంట వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మాగుంట కుటుంబం పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యారు కూడా. ఈ తరుణంలో మాగుంట కుటుంబానికి జగన్ టికెట్ ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఎంట్రీ అయితే పార్టీకి బాలినేని తో పాటు మా గుంట దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే జగన్ వైవి సుబ్బారెడ్డిని విశాఖ నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల నుంచి వెళ్లే ఉద్దేశం తనకు లేదని వైవి సుబ్బారెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version