Homeఆంధ్రప్రదేశ్‌TDP: తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తోందా?

TDP: తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తోందా?

TDP: టిడిపి తప్పటడుగులు వేస్తోందా? చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలకు దిగుతోందా? అవే మైనస్ గా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి అగ్ర నేతలు ఉన్నారని ఒకసారి.. జూనియర్ ఎన్టీఆర్ ఇదంతా చేయిస్తున్నారని మరోసారి టిడిపి నేతలు తూలనాడుతూ మాట్లాడుతున్నారు. అటు కేసులో ఎవరి వాంగ్మూలం కీలకంగా మారిందో… వారితోనే అనుకూల మీడియాలో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. మున్ముందు ఇవే ఇబ్బందికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బిజెపి అగ్రనేతలకు సంబంధమే ఉంది అనుకుందాం. దానిని బాహటంగా చెబితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసు కదా? ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల వర్గమే ఎక్కువ. మరి అంత బలం ఉండేటప్పుడు వారి సేవలను వినియోగించుకోవచ్చు కదా. పక్కన తెలంగాణలో కేసీఆర్ విషయంలో కూడా బిజెపి అదే స్ట్రాటజీతో ఉందన్న వార్తలు వస్తున్నాయి. లిక్కర్ స్కాం వ్యవహారంలో కెసిఆర్ చాలా తెలివితేటలుగా డీల్ చేశారు. మరి ఆ స్థాయి తెలివితేటలు చంద్రబాబుకు లేవా? అన్నది ప్రశ్న. చంద్రబాబు విషయంలో జగన్ మొండిగా ముందుకు పోయారు. ఈ సమయంలో చతురత ప్రదర్శించాలే తప్ప.. బిజెపి పెద్దలపై నిందల మోపడం అసలుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎటువంటి రాజకీయ వేదికలు పంచుకోవడం లేదు. తన పనేదో తాను చూసుకుంటున్నారు. చంద్రబాబుకు కష్టం వచ్చిందని.. ఆయన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసే సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ను లాగారు. దీనిపై స్పందించాలా? లేదా? అన్నది వారి విచక్షణ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టిడిపిలో చంద్రబాబు తర్వాత లోకేష్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి అరెస్టుపై గట్టిగానే పోరాడుతున్నారు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను ఆడిపోసుకోవడం ద్వారా వచ్చేది ఏమీ లేదు. పైగా తారక్ స్పందించకపోతే పట్టించుకోకపోవడం మానేసి.. ఈ వివాదంలోకి ఆయన లాగి మరికాస్త హైప్ ఇస్తున్నారు.

వాస్తవానికి టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావాలన్న నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తారక్ పార్టీ కష్ట కాలంలో ఉండేటప్పుడు స్పందించకపోవడం, లోకేష్ మంచి పనితీరు కనబరుస్తుండడంతో… ఇక జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్న భావనకు వస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తారక్ ప్రస్తావన తేవడం అవసరం లేని చర్య. పైగా లోకేష్ ఉండగా తారక్ ఇక ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటువంటి చర్యలు ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారుతాయి అన్న విషయం టిడిపి శ్రేణులు తెలుసుకుంటే మంచిది.

మరోవైపు చంద్రబాబు కేసులో కీలక అధికారులుగా ఉన్న వారిని తెచ్చి ఎల్లో మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. గతంలో వీరి వాంగ్మూలం తోనే రిమాండ్ రిపోర్టు తయారు చేసినట్లు సిఐడి చెబుతోంది. ఇప్పుడు అదే అధికారులు మాట మార్చి చెబుతుండడం, టిడిపి అనుకూల మీడియాలో ప్రాధాన్యం లభిస్తుండటంతో.. వాటిని సాకుగా చూపి సిఐడి చంద్రబాబు బెయిల్ ను అడ్డగించే అవకాశం ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిఐడి వాదించేందుకు చేజేతులా తెలుగుదేశం పార్టీ అస్త్రం ఇస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version