Homeజాతీయ వార్తలుమోడీ ‘గెటప్’ చేంజ్ చేసింది అందుకేనా?

మోడీ ‘గెటప్’ చేంజ్ చేసింది అందుకేనా?

Modi
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును మరి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక్క విద్య నేర్చుకోవాల్సిందే. ఏదో ఒక విద్య వస్తేనే కదా బతుకు నావా నడిచేది. అయితే.. ఇది రాజకీయ నాయకులకూ వర్తిస్తుంది. ఓట్ల కోసం తీరొక్క విద్యలు అన్నట్లుగా నడుస్తుంటారు. ప్రతి ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలను చూస్తుంటాం. కొంత మంది నాటకీయతను ప్రదర్శిస్తుంటే.. మరికొందరైతే ఏకంగా ఆయా పాత్రల్లో జీవిస్తుంటారు. ఇంకొంతమంది పరకాయ ప్రవేశం చేస్తారు.

ఇప్పుడు దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఓట్ల వేటలో పడ్డారు. ఒక్కో నేత ఒక్కో స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళపై మోడీకి పెద్దగా ఆశల్లేవు. పశ్చిమ బెంగాల్, అసోం లపై ఆయనకు కొద్దిపాటి ఆశ ఉంది. అందుకే అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కొంతకాలంగా గడ్డం పెంచుతున్నారు. ఈ ఆహార్యంతో ఆయన విఖ్యాత బెంగాలీ కవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాధ్ ఠాగూర్‌‌ను తలపిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాషాయ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

అయితే.. బెంగాలీలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. తమకు తాము బుద్ధిజీవులమని (మేధావులు) వారు భావిస్తుంటారు. బెంగాల్‌కు చెందిన ఠాగూర్ తో పాటు అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ ఈ ప్రతిష్టాత్మక బహుమతులు గెలుచుకున్నారు. మొదటి నుంచీ నరేంద్ర మోదీ గడ్డంతోనే ఉంటారు. కానీ.. బెంగాల్‌లో ఎన్నికల కోసమే తెల్లటి గడ్డాన్ని పెంచారన్న అభిప్రాయం బెంగాల్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిని తోసిపుచ్చడం కష్టమే. ఎన్నికలు జరుగుతున్న ఈశాన్య రాష్టమైన అసోం ఓటర్లను ఆకట్టుకునేందుకు నరేంద్ర మోదీ ఇదే రకమైన విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అస్సామీ పురుషులు ధరించే సంప్రదాయ వస్త్రమైన ‘గమోసా’ ను మోడీ గత కొంతకాలంగా మెడలో వేసుకుంటున్నారు. ఇది దీర్ఘచతురస్రాకార వస్ర్తం. మూడు వైపులా ఎరుపు అంచులు, మధ్యలో తెల్లటి రంగు కలిగి ఉంటుంది. దీన్ని ధరించడాన్ని అస్సామీలు గౌరవంగా, గర్వంగా భావిస్తుంటారు.

ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే సమయంలోనూ మోడీ దీనిని ధరించడం గమనార్హం. ఈ సందర్భంగా అసోం వైద్య ఆరోగ్య, ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ మోదీకి కృతజ్ఞతలు సైతం తెలిపారు. మోడీ ఇటీవల మహిళలు తయారుచేససిన ‘గమోసా’ను కొనుగోలు చేశారు. అయితే ఎన్నికల జిమ్మిక్ అని కొందరు విమర్శించారు. బిహార్ ఎన్నికల సమయంలోనూ అక్కడి రుచికరమైన వంట ‘లిట్టి చోఖా’ గురించి ఇలానే ప్రచారం చేశారని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో ఇతర నాయకులూ ఏమీ వెనకబడి లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ ఇటీవల కేరళ పర్యటనకు వెళ్లి అనూహ్యంగా సముద్రంలోకి దూకి మత్స్యకారులతో కలిసి ఈదారు. నాస్తికత్వానికి నిఖార్సై న ప్రతినిధినని చెప్పుకునే డీఎంకే సైతం తన ఎన్నికల ప్రణాళికలో గుళ్లు, గోపురాల గురించి హామీలు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా ఎన్నికల్లో సంగ్రామంలో ఈదడానికి పార్టీల వారీగా ప్రయాస పడుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version