దేశంలో బీజేపీ సర్కారు రెండు సార్లు కొలువుదీరింది. ఈ క్రమంలో వచ్చే సహజ వ్యతిరేకతకు తోడు.. కరోనాను సరిగా నియంత్రించలేకపోవడం, వ్యవసాయ చట్టాలు వంటివి.. కేంద్రంపై వ్యతిరేక ప్రభావం చూపించాయి. అయితే.. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో విపక్షం లేకపోవడం గమనార్హం. 2014లో పడిపోయిన కాంగ్రెస్ ఇప్పటి వరకు తిరిగి పుంజుకోలేదు. మిగిలిన పార్టీల పరిస్థితి చూస్తే.. అవన్నీ ప్రాంతీయ పార్టీలుగానే ఉండిపోయాయి. దీంతో.. 2024లో మోడీని ఎదుర్కొనే నేత ఎవరు? అనే చర్చ బలంగానే సాగుతోంది.
అయితే.. బీజేపీ, కాంగ్రెస్ తో కలవకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, కమ్యూనిస్టులు కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రయత్నమైతే చేస్తున్నరుగానీ.. ఎన్నో లొసుగులు ఉండడం గమనించాల్సిన అంశం. ఈ పార్టీల బలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం పెద్ద మైనస్. దాదాపు సగానికిపైగా రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోరుసాగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి.. కాంగ్రెస్ లేకుండా ఏర్పడే థర్డ్ ఫ్రంట్ ఏ మేరకు మనగలుగుతుందన్నది ప్రశ్న.
ఒకవేళ ఏర్పాటు చేసినా.. ప్రధాని అభ్యర్థ ఎవరన్నది మరో ప్రశ్న. మోడీకి సరితూగే నేతను ఎంచుకోవాల్సి ఉండడం ఒకెత్తయితే.. ఆ ఒక్కరిని మిగిలిన వారు ఎంత వరకు అంగీకరిస్తారన్నది ఇంకో ప్రశ్న. ప్రధాని సీటులో కూర్చోవాలని ఎవరికి మాత్రం ఉండదు? దశాబ్దాలుగా పాలిటిక్స్ లో కొనసాగుతూ.. ప్రధాని పీఠం ఎక్కాలని కలలు కనేవారు కూడా ఈ థర్డ్ ఫ్రంట్ లో ఉన్నారు. మరి, అలాంటప్పుడు.. సఖ్యత ఎలా కుదురుతుందనే సందేహం కూడా ఉంది.
ఇప్పటికే కొందరు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు కూడా వినిపిస్తున్నారు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ ను కలుపుకోవడం ద్వారానే బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందని, కాబట్టి రాహుల్ రేసులోకి రావొచ్చని అంటున్నారు. ఇంకొందరైతే.. మమతా బెనర్జీ అయితేనే మోడీని ధీటుగా ఎదుర్కోగలరని చెబుతున్నారు. బెంగాల్ బీజేపీని ఓడించి, ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ అయితేనే.. మోడీకి సరైన ప్రత్యర్థిగా ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలో.. చాలా మంది మమతకే ఓటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి, ఈ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఎంత వరకు వర్కవుట్ అవుతుంది? ఎవరు మోడీని ఎదుర్కొనే నేతగా నిలుస్తారు? అన్నది చూడాలి.