Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పథకం లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు ఏపీ సిఐడి ఇప్పటికే ఆయనను రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఆయన చేస్తున్న బెయిల్ ప్రయత్నాలను తెలివిగా తిప్పికొడుతోంది. సరే ఇందులో ఏ నిజాలు ఉన్నాయో తెలియదు గానీ.. ప్రస్తుతం ఏపీ సిఐడి వేస్తున్న అడుగులు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పటికే లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ మీద సిఐడి అధికారులు దృష్టి సారించారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా, వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్లో టౌన్ ప్లానింగ్ శాఖలో ఆయన అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి జరిగిన డబ్బుల బదిలీలు పెండ్యాల శ్రీనివాస్ కు అన్ని విషయాలు తెలుసు అని ఏపీ సిఐడి అధికారులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు అంటే సెప్టెంబర్ ఆరవ తేదీన ఏపీ సిఐడి అధికారులు పెండ్యాల శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. అయితే మరుసటి రోజు ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 9న సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబును కోర్టు అనుమతితో సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే అమరావతి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ద్వారా డబ్బులు చేతులు మారాయని, అతడిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన మరుసటిరోజే చంద్రబాబు నాయుడు పీఏ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన విదేశాలకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని సిఐడి అధికారులు చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ అమెరికా వెళ్లారని కొందరు, లేదు లండన్ వెళ్లారని మరికొందరు చెబుతున్న నేపథ్యంలో.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు టికెట్ బుక్ చేసింది ఎవరు? ఏ దేశంలో ప్రస్తుతం ఉన్నాడు? అనే విషయాలపై సిఐడి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం శ్రీనివాస్ ఆచూకీ సిఐడి అధికారులకు తెలిసిందని, అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు వారు బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. మరోవైపు లోకేష్ ను అంటిపెట్టుకొని ఉండే కిలారు రాజేష్ కూడా కనిపించడం లేదని ఏపీ సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ కు సిఐడి అధికారులు.. ఏపీ ఫైబర్ నెట్ కేసులో నోటీసులు అందించారు. అయితే ఈ వ్యవహారంలోనూ కిలారు రాజేష్ ద్వారానే డబ్బులు చేతులు మారాయని ఏపీ సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. అతడిని కూడా విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. అయితే కిలారు రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నట్టుండి అతడు ఎందుకు కనిపించడం లేదు? అనే విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే అతడిని కూడా త్వరలో సిఐడి అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అటు స్కిల్ డెవలప్మెంట్, ఇటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో సిఐడి చాలా బలంగా అడుగులు వేస్తోంది. చూడాలి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో?!