PM Modi Oath Ceremony: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్రమోదీ ఆదివారం (జూన్ 9న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ఎన్డీఏ పక్ష నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సినీ క్రీడా బిజినెస్ ప్రముఖులతో పాటు.. పొరుగు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా బీజేపీ మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది.
రత్యేకంగా ఆహ్వానించిన మాజీ మంత్రి..
కేసీఆర్ను.. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఆహ్వానించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఫోన్ చేసి కోరారు.
వచ్చేది అనుమానమే..
గతంలో మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో మోదీ ప్రమాణ స్వీకారినికి వెళితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కర్తవ్యపథ్లో వేడుక..
ఇదిలా ఉండగా ఢిల్లీలోని కర్తవ్యపథ్(కొత్త పార్లమెంటు భవనం)లో మోదీ ప్రమాణస్వీకార వేడుక జరుగనుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు కొందరు ప్రత్యేక వ్యక్తులను కూడా బీజేపీ ఆహ్వానించింది. గతేడాది పూర్తయిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ సహా రైల్వే శాఖలోని కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారు, పలువురు ట్రాన్స్ జెండర్లను కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. దేశాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్న ఇలాంటి రంగాల వారిని మోదీ తన ప్రమాణ స్వీకారనికి ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.