KTR: కౌంటింగ్‌‌ ముందు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్.. ధీమానా.. గాంభీర్యమా !?

ఎన్నికల పోలింగ్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 70 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ప్రకటించాయి.

Written By: Raj Shekar, Updated On : December 3, 2023 8:33 am

KTR

Follow us on

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు మొదలు కాబోతున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ హ్యాట్రిక్ లోడింగ్ 3.0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి ‘ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

ఇంట్రెస్టింగ్ ఫోటో..
ఇక ఈ ట్వీట్ కు గన్ గురిపెట్టినట్లుగా ఉన్న తన పాత ఫొటో జోడించారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ట్వీట్ పై పడింది. విపక్ష కాంగ్రెస్ కూడా ఏదైనా జరుగుతుందా.. లెక్క ఎక్కడైనా తప్పుతుందా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారా అనుకునేలా ట్వీట్ ఉంది.

కేడర్ కు బూస్ట్..
ఎన్నికల పోలింగ్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 70 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ప్రకటించాయి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ స్పందిస్తూ నిజమైన ఫలితాలు డిసెంబర్-03న వస్తాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. సర్వేలు తప్పని తేలితే క్షమాపణలు చెబుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కానీ శుక్ర, శని వారాల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి. అయినా కేటీఆర్ ట్వీట్ చేయడం.. కేవలం కేడర్ లో జోష్ నింపేందుకు అని.. కాంగ్రెస్ వైపు చూస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేల దృష్టి మరల్చేందుకు అని గులాబీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

8 గంటల నుంచి కౌంటింగ్..
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ పార్టీ సీట్ల కన్నా బీజేపీ సీట్ల పై దృష్టి సారించారు. బీజేపీ ప్రభావం ఎవరిపై ఉంటుంది అన్న ఆందోళన కనిపిస్తోంది.