ఒక మత ప్రచారం కోసం కరీంనగర్ వచ్చిన పది మంది ఇండోనేషియన్ల బృందానికి తమలో కరోనా వైరస్ ఉన్నదన్న విషయం తెలుసట …ఇండోనేషియా నుంచి వీరు ఇండియా బయలు దేరే సమయానికే వీరికి కరోనా వైరస్ సోకిందట . అయితే ఎయిర్పోర్ట్ సిబ్బందికి దొరికిపోతే, ఆసుపత్రిలో పెడతారని, తాము ఇండియా రాలేమన్న సందేహం తో పారాసిటమాల్ మాత్రలు వేసుకొని కరోనా ని కప్పిపుచ్చారట …
కరీంనగర్లో మత ప్రచారానికి వచ్చిన పదిమంది ఇండోనేషియన్ల బృందం ఇక్కడ దాదాపు 500 మందిని కలిసినట్టు తేలడం తో మన పోలీసులు వారి నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కరీంనగర్లో లాక్డౌన్ ప్రకటించి, రాకపోకలను పూర్తిగా మూసివేశారు. ఇండోనేషియన్లు కలిసిన వారిలో కొందరిని గుర్తించిన అధికారులు, వారిని ఇళ్లల్లో క్వారంటైన్ చేయగా, మరికొందరిని ఆసుపత్రులకు పంపించారు, అయితే ఇప్పటిదాకా సేకరించిన వివరాల ప్రకారం ఇండోనేషియా బృందంతో తిరిగిన వారిలో ఒక వ్యక్తి కి మాత్రమే కరోనా పాజిటివ్గా తేలింది . అదొక్కటే ఊరట కలిగించే విషయం.
అయితే మత ప్రచార కార్యక్రమం కోసం ఇండియా వచ్చిన ఇండోనేషియన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఢిల్లీ లో నాలుగు రోజులు గడపడం తో పాటు రామగుండానికి యథేచ్ఛగా రైల్లో వచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్కు వెళ్లి, మత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అలా కార్యక్రమం ముగిసిన తర్వాత బృందంలో ఒకరు తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడుతుంటే, అసలు విషయం బయటికొచ్చింది.