CEO Shankh Mitra: టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యధిక ప్యాకేజీ ( 158 బిలియన్ల డాలర్లు) అందుకుంటున్న సీఈఓగా మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాన్ని ఒక భారతీయుడు కైవసం చేసుకోవడం విశేషం. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ అయిన ‘వెల్టవర్’ (Welltower) చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శంఖ్ మిత్రా ఏకంగా 821 మిలియన్ డాలర్ల వార్షిక ప్యాకేజీని అందుకున్నారు. మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 6,890 కోట్లు. ఈయన గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో భారతీయ ప్రతిభ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. నిన్న మొన్నటి వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నిఖేష్ అరోరా వంటి పేర్లనే విన్న గ్లోబల్ మార్కెట్.. ఇప్పుడు కోల్కతా వీధుల నుండి వాల్ స్ట్రీట్ టాప్ లీగ్లోకి దూసుకొచ్చిన శంఖ్ మిత్రా వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రముఖ బిజినెస్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీఈఓల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.
శంఖ్ మిత్రా విజయప్రస్థానం భారతదేశంలోనే ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఆయన, అక్కడి ప్రసిద్ధ జాదవ్పూర్ యూనివర్సిటీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీఈ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన, ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్లో ఎంబీఏ పట్టా పొందారు. ప్రపంచ స్థాయి ఆర్థిక రంగంలో రాణించడానికి ఈ విద్యాభ్యాసం ఆయనకు బలమైన పునాది వేసింది.
ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత శంఖ్ మిత్రా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ‘పిడబ్ల్యుసి’ సంస్థలో ప్రారంభించారు. అక్కడ ఐదేళ్ల పాటు పనిచేసి ఫైనాన్స్, బిజినెస్ అడ్వైజరీ రంగాలపై పట్టు సాధించారు. ఆ తర్వాత ఫైడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ , సిటాడెల్ , మిలీనియం మేనేజ్మెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లో సీనియర్ అనలిస్ట్గా, పోర్ట్ఫోలియో మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్లలో ఆయనకున్న అసాధారణ ప్రతిభ వాల్ స్ట్రీట్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీనియర్ హౌసింగ్ (వృద్ధుల వసతి గృహాలు) రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్ అండ్ పీ 500 సంస్థ ‘వెల్టవర్’లో శంఖ్ మిత్రా 2016లో చేరారు. కేవలం రెండేళ్లలోనే, అంటే 2018 నాటికి ఆయన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అయ్యారు. ఆ తర్వాత తన లీడర్షిప్ స్కిల్స్తో కంపెనీని మరింత లాభాల్లోకి నడిపించి, అక్టోబర్ 2020లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో వెల్టవర్ షేర్ల విలువ అసాధారణంగా పెరగడం గమనార్హం.దీంతో శంఖ్ మిత్రా మార్కెట్ విలువ రూ. 6,890 కోట్లుగా మారింది.
