spot_img
Homeజాతీయ వార్తలుChina Apps Banned: మూడు చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. వాళ్లు మారరంతే!

China Apps Banned: మూడు చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. వాళ్లు మారరంతే!

China Apps Banned: కోవిడ్‌ సమయంలో గాల్వన్‌ ఘటనతో చైనా–భారత్‌ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇటీవలే భారత్, చైనా దగ్గరవుతున్నాయి. గతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులు, యాప్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. సంబంధాల పునరుద్ధరణతో మళ్లీ వ్యాపారం సంబంధాలు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో చైనా యాప్‌లతో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఈ–రిక్షా డ్రైవర్లు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వాహనాలు నిలిచిపోతున్న సంఘటనలు పెరిగాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా రిమోట్‌గా నియంత్రించడం వల్ల జరుగుతోందని తేలింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ప్రాంక్‌ వీడియోలు ఈ సమస్యను బయటపెట్టాయి. వీటిలో ప్రజలు బ్లూటూత్‌ ద్వారా దగ్గర్లోని ఈ–రిక్షా బ్యాటరీకి కనెక్ట్‌ అయి, ఒక్క ట్యాప్‌తో డిశ్చార్జ్‌ ఫంక్షన్‌ను ఆఫ్‌ చేసి వాహనాన్ని ఆపేస్తున్నట్లు చూపించారు. డ్రైవర్లు మధ్యలో నిలిచిపోయి, ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, రోజువారీ ఆదాయం కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా వీడియోలు వచ్చాయి. ఇది కేవలం ప్రాంక్‌ కాదు – డ్రైవర్ల జీవనోపాధిని, రోడ్డు భద్రతను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యగా మారింది.

యాప్‌లలో భద్రతా లోపాలు..
ఈ సమస్యకు కారణమైన యాప్‌లు చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ యాప్‌లు. ప్రధానంగా BAT-MS(షెన్‌జెన్‌ గ్రీనర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసినది), Losiji, Epoch Li-ion (Epoch-i-ion) వంటి మూడు యాప్‌లు గుర్తించబడ్డాయి. కొన్ని నివేదికల్లో SMART BMS వంటి మరిన్ని యాప్‌లు కూడా ప్రస్తావించబడ్డాయి. లిథియం–అయాన్‌ బ్యాటరీల వోల్టేజ్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్‌ సైకిల్స్, బ్యాటరీ ఆరోగ్యం వంటి వివరాలను మానిటర్‌ చేయడం. కానీ చాలా తక్కువ ధరల ఈ–రిక్షా బ్యాటరీలలో పాస్‌వర్డ్‌ లేదా ఏదైనా ధృవీకరణ లేదు. బ్లూటూత్‌ పరిధిలో ఉన్న ఎవరైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కనెక్ట్‌ అయి, బ్యాటరీ డిశ్చార్జ్‌ను ఆఫ్‌ చేయవచ్చు. ఒక్క ట్యాప్‌తో వాహనం పూర్తిగా నిలిచిపోతుంది. ఇది హార్డ్‌వేర్‌ లోపం, యాప్‌ సెక్యూరిటీ లోపం కలిపి ఏర్పడిన ప్రమాదకరమైన కాంబినేషన్‌.

కేంద్ర ప్రభుత్వం చర్యలు..
సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయిన వెంటనే కేంద్రం త్వరితగతిన స్పందించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి చైనా యాప్‌లను తొలగించాలని ఆదేశించింది. ఐటీ సెక్రటరీ కృష్ణన్‌ ఈ చర్యను నిర్ధారించారు. ఏదైనా ఇతర యాప్‌ ఇలాంటి దుర్వినియోగానికి ఉపయోగపడితే కూడా బ్లాక్‌ చేస్తామని హెచ్చరిక చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విచారణ ఆదేశించింది. ఇది అనధికృత యాక్సెస్‌గా ఐటీ చట్టం కింద నేరం కావచ్చని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సైబర్‌ భద్రత లోపాలు..
ఈ సంఘటన ఎలక్ట్రిక్‌ వాహనాల సైబర్‌ భద్రతలో ఎంత పెద్ద లోపాలు ఉన్నాయో చూపిస్తోంది. తక్కువ ధరల చైనా బ్యాటరీలు భద్రతా ఫీచర్లు లేకుండా తయారు చేయడం వల్ల ఇలాంటి దుర్వినియోగం సాధ్యమైంది. డ్రైవర్లు చాలా మంది రోజువారీ కూలీలు లేదా రెంట్‌కు వాహనం తీసుకున్నవారు. ఒక్క రోజు ఆదాయం కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది హరాస్‌మెంట్‌ లేదా ఎక్స్‌టార్షన్‌గా కూడా మారిందని నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న త్వరిత చర్య అభినందనీయం. ఇది పౌరుల రక్షణపై నిబద్ధతను చూపిస్తోంది. అయితే, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. టరీలలో తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ లేదా మల్టీ ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ ఉండాలి.

ఆధునిక సాంకేతికత ఎంత ఉపయోగకరంగా ఉన్నా, భద్రతా లోపాలు ఉంటే అది ఆయుధంగా మారుతుంది. జాతీయ భద్రత, ప్రజా రవాణా భద్రతకు సంబంధించిన ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version