India bans Chinese CCTV cameras: చైనా అంటేనే చీటింగ్. నమ్మించి మోసం చేయడంలో నంబర్ వన్. అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా అనేక తప్పుడు మార్గాలను అన్వేషిస్తోంది. ఆసియాలో తనకు పోటీగా భావించిన భారత్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యాప్స్ను భారత్ ఇప్పటికే నిషేధించింది. తాజాగా చైనా తయారు చేసిన సీసీ కెమెరాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల హిక్విజన్, దహువా, టీపీ–లింక్ వంటి దిగ్గజ చైనా కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కొత్త నిబంధనలు అమలు..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తప్పనిసరి అవసరాల నిబంధనలను అమలు చేసింది. సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలి. ఈ నిబంధనలు ఏప్రిల్ 2024లో అమల్లోకి వచ్చాయి, దీనికి అనుగుణంగా మారడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది. ఈ ఏప్రిల్ నుంచి ఈ గడువు ముగియడంతో, నిబంధనలు పాటించని ఉత్పత్తుల అమ్మకాలు నిషేధించబడతాయి. తయారీదారులు తమ సిస్టమ్–ఆన్–చిప్ వంటి కీలక భాగాల మూల దేశాన్ని తప్పనిసరిగా ప్రకటించాలి. దీంతో చైనాలో తయారైన చిప్సెట్లను ఉపయోగించే పరికరాలకు ధ్రువీకరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే కెమెరాలపై ప్రత్యేక నిఘా ఉంది.
దేశీయ కంపెనీలకు లాభం..
ఈ నిర్ణయం వల్ల భారతీయ సీసీటీవీ తయారీదారులకు భారీ అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కాన్ట్రాన్ కంపెనీ అత్యధికంగా లాభపడనుంది. దేశీయ భద్రతా పరికరాల దిగ్గజం గోద్రెజ్ సెక్యూరిటీకి కూడా మేలు జరుగుతుంది. హనీవెల్, మైక్రో సెక్యూరిటీ, రెయోలాబ్స్ వంటి స్టార్టప్ కంపెనీలు లాభపడతాయి.
Also Read: కేంద్రం సంచలనం.. సహజీవనం చేసే వాళ్లు ఇక చెప్పాల్సిందే
చైనా వస్తువులతో ముçప్పు
చైనా సీసీటీవీ కెమెరాలు సేకరించిన వీడియో డేటాను చైనా సర్వర్లకు పంపిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నెట్కు కనెక్ట్ అయిన కెమెరాల ద్వారా బ్యాక్డోర్ యాక్సెస్ కల్పించే అవకాశం ఉంది. సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కీలక మౌలిక సదుపాయాల సమీపంలో ఈ కెమెరాలు ఉంటే, సమాచారం చైనాకు చేరుతుందని భయాందోళనలు ఉన్నాయి. హిక్విజన్, దహువా వంటి కంపెనీలు చైనా ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు చైనా ప్రభుత్వ నిఘా ప్రాజెక్టుల్లో పాల్గొంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ కెమెరాల ద్వారా గూఢచర్యం జరిగే ముప్పు ఉంది.
సైబర్ దాడుల ముప్పు
చైనా కెమెరాలలో వల్నెరబిలిటీస్ గుర్తించారు. హ్యాకర్లు ఈ కెమెరాలను ఉపయోగించి నెట్వర్క్లలోకి చొరబడే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత, చైనా యాప్లు, పరికరాలపై నిషేధం విధించినట్లే, ఇప్పుడు సీసీటీవీలపై చర్యలు తీసుకుంటోంది.
చైనా కంపెనీలకు నష్టం
హిక్విజన్, దహువా వంటి కంపెనీలు భారత్ మార్కెట్లో వార్షికంగా రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ నిషేధం వల్ల వారికి భారీగా నష్టం జరుగుతుంది. భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది లేదా పూర్తిగా స్థానిక తయారీకి మారాల్సి ఉంటుంది.
చైనా పరికరాలపై ఈ నిర్ణయం, భారత్ యొక్క ఆత్మనిర్భర భారత్ విధానానికి నిదర్శనం. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉంది. వినియోగదారులు కూడా సురక్షితమైన, నాణ్యమైన దేశీయ ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం లభిస్తుంది.