Stalin: “ఇండియా” ప్రధాని అభ్యర్థిగా అవకాశం.. స్టాలిన్ ఏమన్నారంటే..

"సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి మెరుగైన స్థానాలు సాధించింది. ఒకవేళ మీకు అవకాశం లభిస్తే.. ప్రధానమంత్రి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకుంటే.. మీరు ఆ స్థానానికి వెళ్తారా" అని మీడియా ప్రతినిధులు అడగగా.. స్టాలిన్ సరైన సమాధానం ఇచ్చారు..

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 7:03 pm

Stalin

Follow us on

Stalin: సార్వత్రిక ఫలితాలలో 400 టార్గెట్ ను బిజెపి రీచ్ కాలేక పోయింది. 240 స్థానాల వద్దే ఆగిపోయింది. అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. మూడోసారి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో.. నరేంద్ర మోదీనే ప్రధానమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ ఎన్డీఏకు అనూహ్య పరిస్థితి ఏర్పడితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఇండియా కూటమి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవకాశాలు కొట్టి పారేయలేమని ఆ కూటమిలోని నాయకులు అంటున్నారు.. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కు ఆసక్తికర ప్రశ్న మీడియా నుంచి ఎదురయింది.

“సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి మెరుగైన స్థానాలు సాధించింది. ఒకవేళ మీకు అవకాశం లభిస్తే.. ప్రధానమంత్రి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకుంటే.. మీరు ఆ స్థానానికి వెళ్తారా” అని మీడియా ప్రతినిధులు అడగగా.. స్టాలిన్ సరైన సమాధానం ఇచ్చారు.. ” నా ఎత్తు ఎంతో నాకు తెలుసు. చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పానని” విలేకరులతో అన్నారు. గతంలో ఇదే విషయాన్ని కరుణానిధి కూడా పేర్కొన్నారు. తన తండ్రి ఫేమస్ డైలాగ్ నే కరుణానిధి విలేకరులతో చెప్పడం విశేషం.. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ” ఈ ఎన్నికల ఫలితాలు విపక్ష కూటమికి ఆనందాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో మా కూటమికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలో 39 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో 40 కి 40 స్థానాలు దక్కించుకున్నాం. ఈ అద్భుతమైన విజయాన్ని నా తండ్రి కరుణానిధికి అంకితం ఇస్తున్నాను. తమిళనాడు మాత్రమే కాదు చాలా రాష్ట్రాలలో మోదీకి వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ విషయాన్ని బిజెపి పెద్దలు గుర్తించాలి.. నేడు సాయంత్రం జరిగే ఇండియా కూటమి పార్టీల సమావేశంలో నేను పాల్గొంటున్నానని” స్టాలిన్ వివరించారు.

స్టాలిన్ ఎత్తు వ్యాఖ్యలు.. ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే వ్యాఖ్యలను గతంలో కరుణానిధి చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా కరుణానిధికి పేరు ఉంది. 13 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తమిళనాడు రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ఎప్పుడు కూడా దేశ రాజకీయాల జోలికి ఆయన వెళ్ళలేదు. 1997లో దేవె గౌడ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కరుణానిధికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ లోని కొంతమంది నాయకులు కరుణానిధిని కలిశారు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు.. ఈ సందర్భంగా వారి ఆఫర్ ను కరుణానిధి సున్నితంగా తిరస్కరించారు. ” నా ఎత్తు ఏంటో నాకు బాగా తెలుస” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి.