పాలించే రాజుకు ఈ గుణం ఉంటే ఆ రాజ్యం సర్వనాశనమే..?

పూర్వం ఒక రాజ్యంలో రాజు పరిపాలన ఎలా ఉందంటే.. అక్కడి ప్రజలు స్థితిగతులు, మొహంలో నవ్వు కనిపిస్తుందా? ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారా? ముఖ్యంగా సంతోషంగా ఉన్నారా? లేదా అనే అంశాలపైనే రాజు పరిపాలనను బేరీజు వేసేవారు. ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా ఉన్నారంటే ఆ రాజు అద్భుతంగా పాలన సాగిస్తున్నాడని.. ప్రజలను చాలా బాగా చూసుకుంటున్నాడని అనుకునేవారు. అదే ప్రజలు దుర్భిక్షంతో కష్టాలు పడుతూ, మొహాలు వాడిపోయి… ఏడుస్తూ కనిపించారంటే ఆ రాజు పరిపాలన కంటే […]

Written By: Neelambaram, Updated On : December 17, 2021 1:32 pm
Follow us on

పూర్వం ఒక రాజ్యంలో రాజు పరిపాలన ఎలా ఉందంటే.. అక్కడి ప్రజలు స్థితిగతులు, మొహంలో నవ్వు కనిపిస్తుందా? ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారా? ముఖ్యంగా సంతోషంగా ఉన్నారా? లేదా అనే అంశాలపైనే రాజు పరిపాలనను బేరీజు వేసేవారు. ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా ఉన్నారంటే ఆ రాజు అద్భుతంగా పాలన సాగిస్తున్నాడని.. ప్రజలను చాలా బాగా చూసుకుంటున్నాడని అనుకునేవారు. అదే ప్రజలు దుర్భిక్షంతో కష్టాలు పడుతూ, మొహాలు వాడిపోయి… ఏడుస్తూ కనిపించారంటే ఆ రాజు పరిపాలన కంటే బాగాలేదని చెప్పేవారు. ఇది మంచి, చెడు పరిపాలన అందించే పాలకుల గురించి అప్పట్లో అలా చెప్పేవారు. కానీ 21 శతాబ్దంలో రాజులు పోయి పాలకులు వచ్చారు. రాజకీయం బాగా వంట బట్టించుకుని ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే చదరంగం ఆడుతున్నారు. అప్పట్లో రాజులు తమ రాజ్యాలను కాపాడుకోవడానికి ఇతర రాజులతో యుద్దాలు చేసేవారు. కానీ ప్రజల మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు..

Andhra Pradesh

కానీ, ప్రస్తుత పాలకులు మాత్రం అధికారం కోసం ప్రజాక్షేత్రంలో తలపడతారు. కాలు దువ్వుతారు. యుద్ధం చేసుకుంటారు. గెలిచిన వారు అందలం ఎక్కితే ఓడిన వారు పాలకుడి పాలనను ఎండగడుతుంటారు. ఐదేళ్ల కొకసారి ఇక్కడ పాలకులు మారుతుంటారు. కానీ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అప్పట్లో ప్రజలంతా సమానమే, అందరూ ఒకేలా జీవించేందుకు పాలన సాగిస్తే ప్రస్తుత పాలకులు మాత్రం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ప్రజల్లోనే విషబీజాలు నాటుతున్నారు. తమకు కావాల్సిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు. నచ్చని వారి అధికారానికి, సంక్షేమానికి దూరంగా పెడుతున్నారు. తమ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలా చేయడం వలన ప్రజల మధ్య దూరం పెరుగుతోంది. వారు మాత్రం సేఫ్ జోన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇటువంటి పాలనే సాగుతోంది. ప్రాంతాలు, వర్గాలు, కులాల వారీగా జగన్ ప్రభుత్వం ప్రజల్లో ఇప్పటికే విషబీజాలు నాటారు.

ఓట్లు వేస్తేనే బాగా చూసుకుంటారా?

పాలకులు ఎలా ఉండాలంటే ఓట్లు వేసినా వేయకపోయినా అంతా మనవాళ్లే.. అందరం మనుషులమే.. ఈసారి మంచి పాలన అందిస్తే వచ్చేసారి వాళ్లే మనకు ఓట్లు వేస్తారు అన్న కోణంలో పాలకుడి ఆలోచన తీరు ఉండాలి. కానీ వీళ్లు నాకు ఓట్లు వేయలేదు కదా? నేను ఎందుకు వీరికి మంచి చేయాలి. వీరితో నాకేంటి అవసరం. వారికి చెడు తలపెట్టాలని చూస్తే ప్రజల్లో ఆ రాజ్యంపై వ్యతిరేకత పెరుగుతుంది. చివరకు రాజ్యం కూలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.. ప్రస్తుతం ఏపీ సీఎం ఓ వర్గం వారిని టార్గెట్ చేసినట్టు జోరుగా చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి విషయంలో ఓ వర్గం వారే లబ్దిపొందుతున్నారని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి. దీంతో అధికారంలోకి వచ్చాక ఆ వర్గం ప్రజలకు లబ్ది చేకూరకుండా ఏకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో రాజధాని ప్రాంతంలో కల్లోలం మొదలైంది. అప్పట్లో అమరావతి రాజధాని అంశం అందరి ఆమోద యోగ్యంతోనే ఫైనల్ చేశారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక వర్గం వారే ఎందుక లబ్దిపొందాలి అన్న కోణంలో ఆలోచించారో ఏమో కానీ మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టనే పెట్టారు.

మంత్రులు కూడా ముఖ్యమంత్రి బాటలోనే..

సీఎం జగనే అనుకుంటే మంత్రులు కూడా అలానే ఉన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఒకవర్గం వారు మాత్రమే లాభపడుతారని, రాజధాని నిర్మాణం అక్కడ చేస్తున్నారని ముందే తెలుసుకుని కొందరు టీడీపీ నేతలు వందల ఎకరాల్లో రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఏకంగా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక అడుగు ముందుకేసి ఓ సామాజికవర్గం అంటూ చెలరేగిపోయారు. ప్రతి మనిషికి సామాజికవర్గం ఉంటుంది. కావాలని ఎవరూ అందులో పుట్టాలని కోరుకోరు. ఈ సామాజిక వర్గాలన్నీమనుషులు గీసుకున్న గీతలే.. రాజకీయం అంటే ప్రాంతాలు, వర్గాలు, కులాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు. కానీ ఏపీ నేతలు అదే రాజకీయం అనుకుంటున్నారు. దీంతో తమ పబ్బం గడుపుకుంటున్నారు. అమరావతి మీద కుల ముద్ర వేసేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెలుస్తోంది. పట్టాలిస్తే కులాలు మారిపోతాయని ఏకంగా ముఖ్యమంత్రే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడి పాలకుడు రాజ్యాన్ని ఏవిధంగా నడిపస్తున్నాడో.. అయితే, రాజధానికి భూములు ఇచ్చిన వారిలో జగన్ వర్గం వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అమరావతి జేఏసీ కన్వీనర్‌గా ముందుండి పోరాడుతున్నది కూడా ఒక రెడ్డే.. ఆయన పేరు శివారెడ్డి. అయినా రాజధాని నిర్మాణం జరిగితే ప్రజలంతా సంతోషంగా ఉంటారు. అభివృద్ధి జరుగుతుందని చూడకుండా కులాల వారీగా ప్రజలను విడగొట్టి రాజకీయ పబ్బం ఎన్నిరోజులు గడుపుతారని కొందరు విమర్శిస్తున్నారు. ప్రజలకు సీన్ అర్థం అయితే, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ నేతలను దూరం పెడతారు. అప్పుడు మళ్లీ ప్రజలతో కలిసి పోరాడుతారా?

అంతా పేదల రైతులే…

2014లో చంద్రబాబు ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం రైతులు 33, 771 ఎకరాలు ఇచ్చారు. ఇంతవరకు వాటిని పరిహారం కూడా రైతులకు అందలేదు. మొత్తం 29754 మంది రైతులు భూములిచ్చారు. వారిలో చిన్న,మధ్యతరగతి రైతులే ఎక్కువగా ఉన్నారు.29 గ్రామాల్లోని రైతులు ప్రభుత్వానికి ఒక్కొ ఏకరం ఇచ్చారు. ఒకటి నుంచి రెండున్నరలోపు ఎకరాలను త్యాగం చేసిన రైతులు 6,278 మంది. రెండున్నర నుంచి 5 ఎకరాల్లోపు భూములు ఇచ్చిన వారు 2,131 మంది ఉన్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది ఉన్నారు. 10 ఎకరాల నుంచి ఆపై ఇచ్చిన వారు వందల్లోనే ఉన్నారు. దాదాపు 69 శాతం మంది రైతులు ఎకరంలోపు భూమలిచ్చారు. వీరంతా మధ్య తరగతి చెందినవారే.. కేవలం 3.3 శాతం మంది మాత్రమే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఉన్నారు. భూములు ఇచ్చిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉండగా.. మిగిలిన వారు 25 శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్రకులాలకు చెందిన వారున్నారు. ఇందులో ఎక్కడ అగ్రకులాల వారు ఎక్కువగా భూములిచ్చారు. అంతా చిన్నకులాల వారు బీసీలే అధికంగా ఉన్నారు. ఈ మాత్రం దానికి ఓ వర్గం పేరు చెప్పి రైతులను ఉద్యమం పేరుతో రోడ్డెక్కెలా పాలకులు చేశారు.

అభివృద్ది వికేంద్రీకరణనా, పాలనా వికేంద్రీకరణనా?

జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఏమీ లేదు. రెండేళ్లు గడిచిపోయాయి. తీరా చూస్తే మూడు రాజధానులు వర్కౌట్ కావని బిల్లు వెనక్కి తీసుకున్నారు. మళ్లీ కొత్త బిల్లుతో వస్తామని ప్రకటించారు. తీరా చూస్తే విశాఖ పాలన రాజధానిగా ఉంచాలని లేకపోతే ఉద్యమిస్తామని ఉత్తరాంధ్ర రైతులు ఉద్యమానికి తెరలేపారు. ప్రభుత్వాన్ని హెచ్చరించే స్థాయికి వెళ్లారు. మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు ఉద్యమిస్తున్నారు. వారు చేపట్టిన పాాదయాత్ర విజయవంత మైంది. ఈ దెబ్బతోనే జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తమ కడపు కాలి భవిష్యత్ కోసం, తమ పిల్లల కోసం ఉద్యమం చేస్తున్న రైతులను వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి వారు కూడా గట్టిగానే బదులిచ్చారు. అమరావతి ప్రాంత ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజల మధ్య మొత్తానికి జగన్ పెద్ద ఫిట్టింగే పెట్టారు. అమరావతే రాజధానిగా ఉంచాలని అమరావతి రైతులు, విశాఖను పాలనాపరమైన రాజధానిగా ఉంచాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తెలివిగా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై జగన్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజల మధ్య దూరం పెరుగుతుంది. ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయి. మరోవైపు రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా ఉద్యమానికి సై అనేలా ఉన్నారు. రానున్నరోజుల్లో ఏపీ ఉద్యమాల వలయంలో చిక్కుకోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సీఎం జగన్ తెలివితక్కువ నిర్ణయం వలన ప్రజల మధ్య ప్రాంతాల వారీగా చిచ్చు రేగిందని అంటున్నారు కొందరు.

Also Read: Chandrababu: టీడీపీ ఖ‌జానా ఖాళీ.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే..!

రాజకీయ పార్టీలు తమకు అవసరం ఉన్నప్పుడు, ప్రభుత్వంపై వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ప్రజల మధ్య ఇలాంటి చిచ్చు రేపుతారు. ఆ తర్వాత ప్రజలు కొట్లాడుకుంటే చివరకు పెద్దమనిషిలాగా వచ్చి పంచాయితీ చెప్పి తమ పనిని కానిచ్చుకుంటారు. అసలు విషయం మరుగున పడుతుంది. తీరా ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేశామని మరోసారి జనం నుంచి ఓట్లు దండుకుంటారు. పాలకుల డివైడ్ అండ్ రూల్ పాలసీ వలన ప్రజలే నష్టపోతున్నారు. పాలకులు మాత్రం సేఫ్ జోన్ లో ఉంటున్నారు.కానీ ఇది ఎక్కువ కాలం సాగదని రాజ్యం గుర్తుంచుకోవాలి. ప్రజలు గుర్తించినప్పుడు ఆ రాజ్యం కాలగర్భంలో కలువక మానదు. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. అందుకే తమ అభివృద్ధిని, ప్రాంతాన్ని, తమను తామే కాపాడుకోవాలి.

Also Read: AP CM: సారూ.. చాలా బిజీ.. ఐపీఎస్ లతో కూడా మాట్లాడలేదట?

Tags