Narendra Modi vision for India: మన ఇంట్లో బియ్యం, పప్పులు మాత్రమే ఉన్నాయి. అవి వండుకోవడానికి నూనె, ఇతర పదార్థాలు కావాలి. అవి కావాలంటే కొనుగోలు చేయాలి. ఒక స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చు. వాడకం స్థాయి దాటిపోతే బియ్యం, పప్పులలో కొంతమేర అమ్ముకొని వాటిని కొనుగోలు చేయాలి. ఇలా అమ్ముకుంటూ పోతే తినడానికి బియ్యం, పప్పులు మిగలవు. ఇప్పుడు అర్థమైంది కదా.. నరేంద్ర మోడీ భాగ్యనగరంలో పర్యటనకు వచ్చినప్పుడు ఎందుకు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పారో..
ప్రధాని మాటలను నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశానికి సంబంధించి దిగుమతులు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. భారత ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం మన దేశం ప్రతి ఏడాది 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. గత ఏడాది ఇంధనం, బంగారం, వంట నూనెలు, ఎరువుల కోసం ఏకంగా 23 లక్షల కోట్లను ఖర్చు పెట్టింది. మన దేశానికి సంబంధించి దిగుమతుల బిల్లు ఏకంగా 74 లక్షల కోట్ల వరకు ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా కొనసాగుతున్నాం. మన దేశ జనాభాకు.. ఉన్న నిలువలను కాస్త అంచనా వేసుకుంటే తొమ్మిది నుంచి 11 నెలల వరకే సరిపోతాయి. ఒకవేళ అవి గనక కరిగిపోతే ఆర్థిక సంక్షోభానికి దారి తీయవచ్చు. అందువల్లే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తరహాలో సూచనలు చేశారు.
మన దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 728 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. ఇది ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలు పెట్టక ముందు. దీనిని మన కరెన్సీలో కనుక చెప్పగలిగితే 69.4 లక్షల కోట్లు. కేవలం రెండు నెలల్లోనే యుద్ధం వల్ల ఫారెక్స్ నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముఖ్యంగా దిగుమతుల బిల్లు 775 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో ముడి చమురు, బంగారం, ఔషధాలు, సెమీ కండక్టర్లు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఇందులో ఎరువులు, వంట నూనెలు, బంగారం బిల్లు అధికంగా ఉండడం విశేషం. దిగుమతుల మీద విపరీతంగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఫారెక్స్ నిలువలు ఘోరంగా కరిగిపోతున్నాయి. దీనికి తోడు డాలర్ విలువ మరింత పెరిగిపోతోంది. రూపాయి విలువ తగ్గిపోతుంది. దీనివల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదు. ఫలితంగా దేశం లో ఆర్థికంగా అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్లే నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఈ మాటలు చెప్పారు. దీన్ని ప్రతిపక్షాలు వేరే విధంగా అన్వయించుకున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం ఇదే. విదేశీ మారక ద్రవ్య నిలువలు అధికంగా ఉంటే.. మనం అమెరికాను కూడా సులభంగా దాటిపోవచ్చు. దానికి కావాల్సింది మనలో పొదుపు మాత్రమే. దానిని కొనసాగిస్తే ఇక తిరుగుండదు.