ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావడంతో ఆంధ్ర నుంచి తెలంగాణ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఈ పాస్ లేని వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. తెలంగాణలో పగటిపూట లాక్ డౌన్ ఎత్తేశారని ప్రయాణికులు రామాపురం చెక్ పోస్టు వద్దకు చేరుకుంటున్నారు.
దీంతో చెక్ పోస్టు వద్ద వాహనాల తాకిడి పెరిగింది. ఆంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్ ఉంటేనే కోదాడ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ పాస్ లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు చేసేదిలేక వెనుదిరిగి వెళ్తున్నారు.
ఈ పాస్ లేని వాహనాలకు అనుమతి లేదని కోదాడ రూరల్ ఎస్సై సైదులు తెలిపారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఈ పాస్ ఉన్న 700 వాహనాలను అనుమతించామని, ఈ పాస్ లేని 1500 వాహనాలను వెనక్కు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. ప్రయాణికులు తెలంగాణ పోలీసులకు సహకరించి ఈ పాస్ తో రావాలని సూచించారు.
ప్రయాణికుల రద్దీతో చెక్ పోస్టు నిండిపోయింది. ఎటు చూసినా వాహనాలే కనిపించాయి. దీంతో పోలీసులు క్రమబద్ధీకరించేందుకు నానా తంటాు పడ్డారు.ఈ పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వాహనాలను వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.