NDA Alliance: సంకీర్ణ ప్రభుత్వంలో బడ్జెట్ ఎలా ఉండబోతోందంటే?

విశ్లేషకుడు శైలేంద్ర భట్నాగర్ ఈ సారి మోడీ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ 2024-25లో ఏమి భిన్నంగా కనిపించవచ్చో వివరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి బడ్జెట్‌లో దాని ప్రభావం కనిపిస్తుందని అన్నారు.

Written By: Neelambaram, Updated On : June 6, 2024 4:04 pm

NDA Alliance

Follow us on

NDA Alliance: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. బీజేపీని మ్యాజిక్ ఫిగర్ 272కు 32 సీట్ల దూరంలోనే ఆపివేశారు. మిత్రపక్షాలను (ఎన్డీయే) కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినా సంకీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాయిట్ పోల్స్ కు వ్యత్యాసం కనిపించింది. పదేళ్లు పూర్తి మెజారిటీతో ఉన్న బీజేపీ బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాలేదు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మిత్ర పక్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోందనే దానిపై సర్వత్రా చర్చ జరగుతోంది. గత బడ్జెట్ వరకు ఎన్డీయే ప్రభుత్వం దృష్టి అంతా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపైనే నిలిపింది. కానీ ఇప్పుడు మిత్రపక్షాలకు కానుకలు ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా మూడోసారి
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కొత్త ప్రభుత్వం జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ పెడుతుంది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా సీట్లు వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ప్రభుత్వం మొత్తం బడ్జెట్ మూలధన వ్యయంపై దృష్టి పెట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. సంకీర్ణ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది, ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వ ఎజెండాలో కూడా మార్పు కనిపిస్తుంది.

బడ్జెట్‌పై ప్రభావం చూపవచ్చు
విశ్లేషకుడు శైలేంద్ర భట్నాగర్ ఈ సారి మోడీ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ 2024-25లో ఏమి భిన్నంగా కనిపించవచ్చో వివరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి బడ్జెట్‌లో దాని ప్రభావం కనిపిస్తుందని అన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు పీఎం మోడీ తన ప్రభుత్వం మూడోసారి ఎన్నికైతే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కానీ ఫలితాలు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి.

యువతపై దృష్టి పెట్టవచ్చు!
ఆర్థిక వ్యవస్థ వేగానికి సంబంధించి మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేసే మూడ్‌లో లేనట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ ఏడాది పూర్తి బడ్జెట్‌లో మోడీ మహిళలు, రైతులు, యువత కోసం పెద్ద ప్రకటనలు చేస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు.

మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటనలు
*పీఎం ఆవాస్ మోజన కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్లు నిర్మిస్తామని చెప్పారు.
*గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తాం, 9-14 సంవత్సరాల బాలికలకు ఉచిత వ్యాక్సినేషన్ చేస్తామని వివరించారు.
*ఇప్పటి వరకు కోటి మంది మహిళలను లక్ పతి దీదీగా మార్చారు. ఈ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచారు.
*PM గతి శక్తి కింద 3 కొత్త కారిడార్లు నిర్మిస్తాం, రాబోయే 10 సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్య 149 కి పెంచుతాం.
*వందే భారత్‌కు చెందిన 40,000 బోగీలను అప్‌గ్రేడ్ చేస్తాం. మెట్రో, నమో భారత్ ఇతర నగరాలకు అనుసంధానిస్తాం.

పూర్తి బడ్జెట్‌లో ఏది భిన్నంగా కనిపించవచ్చు?
లోక్ సభ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొత్తగా ఏవైనా చేరుస్తారని భావిస్తున్నారు. సామాన్యులకు పన్ను రాయితీ, రైతుల కోసం ప్రత్యేక ప్రకటనలు, ఇదే కాకుండా, ప్రధానమంత్రి ఉజ్వల పథకం వంటి ఇతర పథకాన్ని తీసుకురావచ్చు. అయితే, వీటితో పాటు, ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కొనసాగించేందుకు మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగంపై దృష్టి పెడుతుంది.