అమెరికన్లకు హ్యాపీ న్యూస్‌.. 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ

కరోనా కారణంగా అగ్రరాజ్యం పెద్ద ఎత్తున నష్టపోయింది. అటు ఆర్థికంగానూ.. ఇటు ప్రాణాలూ కోల్పోయారు. అక్కడి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు సైతం ఆ దేశానికి పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగపరిచేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ సిద్ధమయ్యారు. అంతే కాదు.. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న వారికి ఉపశమనం కలిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు గురువారం ఆ దేశ […]

Written By: Srinivas, Updated On : March 11, 2021 3:38 pm
Follow us on


కరోనా కారణంగా అగ్రరాజ్యం పెద్ద ఎత్తున నష్టపోయింది. అటు ఆర్థికంగానూ.. ఇటు ప్రాణాలూ కోల్పోయారు. అక్కడి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు సైతం ఆ దేశానికి పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగపరిచేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ సిద్ధమయ్యారు. అంతే కాదు.. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న వారికి ఉపశమనం కలిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు గురువారం ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.

Also Read: ఆ.. ఇద్దరి తొందరపాటు.. రాజకీయ జీవితంపై పోటు..?

కోవిడ్‌తో ఏర్పడిన సంక్షోభం కారణంగా చతికిలపడ్డ చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఊతమిచ్చి.. పౌరులను ఆర్థికంగా ఆదుకునేందుకు అధ్యక్షుడు గతంలో 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఉద్దీపన ప్యాకేజీ కూడా. అమెరికన్‌ కాంగ్రెస్‌లో బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. 220–211 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. డెమొక్రాట్లందరూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకించారు.

అయితే.. అత్యధిక సభ్యుల నుంచి బిల్లులకు మద్దతు లభించడంతో ఆమోదం పొందినట్లు స్పీకర్‌‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందడంపై బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపటికే ‘నిరుద్యోగులకు ఉపశమనం, అందరికీ టీకాలు’ అని పేర్కొంటూనే.. ‘సహాయం ఇక్కడ ఉంది’ అంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ఆ బిల్లుపైనా శుక్రవారం సంతకం చేయనున్నట్లు తెలిపారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఉద్దీపన ప్యాకేజీ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ‘ఈ రోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం మిలియన్ల మంది అమెరికన్ల జీవితాలను, జీవనోపాధిని కాపాడేది’అని స్పీకర్‌‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు.

Also Read: ఉక్కు వెనుక కేంద్రం తుక్కు నిర్ణయం

కాగా. గత శనివారమే ఉద్దీపన ప్యాకేజీ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందింది. సెనేట్‌లో 50–49 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. రెండు సభల్లోనూ ఈ బిల్లుకు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓట్లు వేయడం గమనార్హం. ఈ బిల్లు చట్ట రూపం దాల్చిన తర్వాత కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికా పౌరులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థికంగా ఆదుకోవడానికి ఉపకరిస్తుంది. కాగా.. కరోనా మహమ్మారి పంజాకు ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌తో 5.25 లక్షల మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు