Heavy Rains In Hyderabad: పేరుకు మహానగరం.. కానీ చిన్న వర్షానికి మునిగిపోతుంది.. ఇది మన అ‘భాగ్య’ నగరం క‘న్నీటి’ కథ.. పోయిన కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ లో వరదలు వచ్చి మనుషులు, కార్లు మొత్తం కొట్టుకుపోతుంటే దేశం యావత్తు వింతగా చూసింది. కబ్జాలతో కకావికలమైన భాగ్యనగరంలో ఇప్పుడు చెరువుల స్థానంలో ఇళ్లు వచ్చి చేరాయి. దీంతో సహజంగానే వానొస్తే ఆ చెరువులున్న ఇళ్లలోకి వరదనీరు ముంచేస్తోంది. మనిషి మునిగేంతగా రహదారుల్లోకి నీరు వస్తోంది.
పోయిన ఏడాది వరదలు నుంచి గుణపాఠం మర్చిపోకముందే నిన్న రాత్రి మళ్లీ వానొచ్చింది. 3 గంటల్లో ముంచేసింది. కుండపోత వానతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య 10 సెం.మీల వర్షం పడడంతో హైదరాబాద్ మునిగిపోయింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి. రోడ్లన్నీ మునిగిపోయాయి. వాహనాలు పడవల్లా తేలిపోయాయి. కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి.
ముఖ్యంగా అమీర్ పేట మైత్రీవనం వద్ద కార్లు నీట మునిగిన దృశ్యం కలవర పరిచింది. మెహిదీపట్నం, రాజేంద్రనగర్, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మాదాపూర్ , జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది.
చాలా డివిజన్లలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. కృష్ణానగర్ లో ద్విచక్రవాహనాలు, ఆటోలు, తోడుబండ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రాత్రి 11 గంటల వరకు కూడా క్లియర్ కాలేదు.
మూడు గంటల్లో 10 సెం.మీల వర్షం పడడంతో హైదరాబాద్ దెబ్బకు మునిగిపోయింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉండడంతో ఇక్కడ పర్యవేక్షణను అధికారులు చూసుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. మరో రెండు రోజులు వర్షాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.