ఏ ఎన్నికలు వచ్చినా అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటుంది. నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియ నడుస్తున్నా అభ్యర్థిని ఫైనల్ చేయరు. కానీ.. ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం తన స్టంట్ను మార్చుకున్నట్లుంది. ఇటీవలే షెడ్యూల్ రాగా.. అప్పుడే ఆ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించేసింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఇచ్చింది.
Also Read: దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఫై ఉత్తమ్కు పరీక్ష. !
తాజాగా.. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ టి.నర్సారెడ్డి పేరును ఖరారు చేసింది. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరునే ఖరారు చేస్తూ హైకమాండ్కు పంపించారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఉత్తమ్ రెడ్డి సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
నర్సారెడ్డి గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వెళ్లారు. మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈనెల 7వ తేదీన పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని టీపీసీసీ వర్గాలు అంటున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక కోసం 147 మంది ఇన్చార్జీలను టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ ప్రకటించారు. ఏడు మండలాలకు ఏడుగురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఉప ఎన్నిక ముగిసే వరకు కూడా అక్కడే ఉంటారు.
Also Read: కేంద్రంతో కేసీఆర్ కయ్యం అందుకేనా..?
ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేరు ఖరారైంది. ఆయన నెల రోజులుగా ప్రచారంలో మునిగిపోయారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో ఖరారు చేస్తారని అంటున్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తారా..వేరే అభ్యర్థిని వెతుకుతారా అనేది క్లారిటీ లేదు. మరోవైపు ఈ ఎన్నికలను కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది.