
Hyderabad Dogs: గజ్వేల్ గ్రామసింహాలు విశ్వనగరం హైదరాబాద్లో గర్జిస్తున్నాయా.. సిటీలో ఉన్నవి చాలవన్నట్లు.. గజ్వేల్ కుక్కలను తెచ్చి గజ్వేల్లో వదిలేశారా అంటే అవుననే అంటున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇప్పుడు ఆకుక్కలే హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఆదివారం అంబర్పేటలో బాలుడిని చంపింది గజ్వేల్ కుక్కే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం ఫామ్హౌస్ ప్రాంతం నుంచి సిటీకి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్ ఏరియాలో వీధి కుక్కల సంచారం పెంచిగింది. ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో పాలకుల అలర్ట్ అయ్యారు. మౌఖిక ఆదేశాలతో గతేడాది జూలైలో జీహెచ్ఎంసీ సిబ్బందిని గజ్వేల్ ప్రాంతానికి రజ్పించి కుక్కలు పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వందలాది కుక్కలను పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి పట్టుకున్న ప్రాంతంలోనే వదిలేయాలి. కానీ వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది స్టెరిలైజేషన్ చేయకుండా, వ్యాక్సినేషన్ చేయకుండా వాటిని వాహనంలో తీసుకెళ్లి విశ్వనగరంలో వదిలేశారు. అప్పటికే 4.5 లక్షలకుపైగా కుక్కలు సిటీలో ఉన్నాయి. తాజాగా గజ్వేల్ కుక్కలు తోడవ్వడం, సంతానోత్పత్తి చేయడంతో వాటి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. దీంతో నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రజలపై దాడులు చేస్తున్నాయి.
గజ్వేల్ కుక్కలను సిటీ ప్రజలపైకి ఉసిగొల్పారు..
గజ్వేల్లోని తన ఫామ్హౌస్ ఏరియాలో కుక్కల బెడదను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ సిబ్బందితో వాటిని పట్టించి సిటీలో వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గజ్వేల్లోని సీఎం ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలతోపాటు చుట్టు పక్కనున్న గ్రామాల్లో మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 200 కుక్కలను పట్టుకున్నట్లు సమాచారం. అయితే మూగజీవాల పరిరక్షణ, సంక్షేమ బోర్టు మార్గదర్శకాల ప్రకారం పట్టుకున్న కుక్కలకు యాంటీ రెబీస్ వ్యాక్సినేషన్, సంతానోత్పత్తి లేకుండా స్టెరిలైజేషన్ చేయాలి. ఏ ప్రాంతంలో పట్టుకున్నారో ఆ ప్రాంతంలోనే తిరిగి వాటిని వదిలేయాలి. కానీ, నాలుగు దఫాలుగా సుమారు 200 కుక్కలను జీహెచ్ఎంసీ సిబ్బంది సిటీలో వదిలినట్లు తెలిసింది.
సికింద్రాబాద్ జోన్లో 86 గజ్వేల్ కుక్కలు..
గజ్వేల్ ప్రాంతంలో పట్టుకున్న కుక్కలన్నీ సిటీలోని ఒకే ప్రాంతంలో వదిలేస్తే స్థానికంగా వ్యతిరేకత వస్తుందని, గజ్వేల్ నుంచి తెచ్చిన విషయం బయటకు వస్తుందని భావించిన పాలకులు వాటిని హాఫీజ్ పేట, శేరిలింగంపల్లి, కొండాపూర్, పటాన్చెరుతో పాటు సికింద్రాబాద్ జోన్లోని అంబర్పేట, మరికొన్ని సర్కిళ్లలో వదిలిపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. సికింద్రాబాద్ జోన్లో సుమారు 86 కుక్కలను వదిలి పెట్టగా, వాటిలో ఎక్కువగా అంబర్పేట సర్కిల్లోనే విడిచి పెట్టినట్లు తెలిసింది.

బాలుడిని చంపింది ఆక్కులేనా?
అంబర్పేటలో బాలుడిపై దాడి చేసిన కుక్కల్లో ఎక్కువ గజ్వేల్ ప్రాంతానికి చెందినవేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్లోని చల్లటి గ్రామీణ వాతారణంలో అవి పెరిగాయి. అక్కడి నుంచి సిటీకి తీసుకురావడంతో ఇక్కడి రణగోణ ధ్వనులు, వాతావరణ మార్పులతో అవి ఇరిటేట్ అయి దాడులకు తెగబడుతున్నాయని చెబుతున్నారు. సీఎం ఫామ్ హౌస్ ఉన్న ఏరియాలో కుక్కల బెడదను నివారించేందుకు వాటిని అక్కడి నుంచి తీసుకొచ్చి సిటీలో వదిలేయడాన్ని మహానగర వాసులు తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగేళ్ల బాలుడిపై దాడి జరిగిన ప్రాంతంలో సుమారు 59 వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇప్పటికే 35 కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్కు తరలించారు. మరో 24 కుక్కలను పట్టుకోవాల్సి ఉన్నది.
గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన గజ్వేల్ కుక్కలు ఇప్పుడు విశ్వనగరంలో ఉస్కో అంటుండడంతో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందతున్నారు. మరిన్ని దాడులు జరుగకముందే వీధికుక్కలను పట్టుకోవాలని కోరుతున్నారు.