Undavalli – Ramoji Rao : ఈనాడు, మార్గదర్శి గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్. రాజమహేంద్రవరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మార్గదర్శి వ్యవహారంపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రామోజీపై తన పోరాటానికి అఫిడవిట్ ద్వారా జగన్ మద్దతునిచ్చారని.. ఆయన కమిట్ మెంట్ కు సలాం చేస్తున్నట్టు తెలిపారు. దీన్ని బట్టి రామోజీతో ఫైట్ లో ఇటు ఉండవల్లి.. అటు జగన్ కలిసి ఈ తతంగం అంతా నడుపుతున్నట్టుగా అర్థమవుతోంది.
– నాడే చెప్పాను..
మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘింంచిందని, ఈ విషయం తాను ఏనాడో చెప్పానన్నారు. నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని పేర్కొన్నారు. ఆ తప్పులు బయటకు తీసినందుకు నాపై రామోజీరావు కేసులు పెట్టించారన్నారు. కానీ, అందుకు తగ్గట్లే చిట్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోంది. మార్గదర్శిని రామోజీ తన ఇష్టమొచ్చినట్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. డిపాజిటర్ల సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారని తెలిపారు. చిట్ఫండ్ నడిపేవారు వేరే వ్యాపారాలు చేయకూడదన్నారు.
-చట్టానికి ఎవరూ అతీతులు కాదు..
బ్రహ్మయ్య అండ్ కంపెనీకి చెందిన సీఏను అరెస్ట్ చేస్తే.. అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమే అని పేర్కొన్నారు. సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామికే రూ. 10 కోట్లు ఫైన్ వేశారన్నారు. వేంకటేశ్వరస్వామి కంటే అతీతుడా అని ప్రశ్నించారు.
– సడెన్గా ఎందుకు అస్వస్థతకు గురయ్యారు..
తనకు తెలిసి రామోజీరావు అస్వస్థతకు గురైనట్లు తాను ఎన్నడూ వార్తకానీ, సమాచారం కాని వినలేదని అన్నారు ఉండవల్లి అరుణ్కుమార్. సీఐడీ విచారణ అనేసరికి ఆయన అస్వస్థత డ్రామా ఆడారని అనిపస్తోందన్నారు. ఆయన వ్యక్తిగత డాక్టర్ రామోజీ ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడం, రామోజీ మాత్రం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని పేర్కొనడం డ్రామా కాకపోతే ఏంటని ప్రశ్నించారు.
విజయ్మాల్యా, రామోజీ ఒక్కటే..
ఇక రామోజీరావు మార్గదర్శి పేరుతో చేసిన ఆర్థిక మోసం విజయ్మాల్య, సత్యం రామలింగరాజులాంటిదే అని ఆరోపించారు. రామోజీరావు, విజయ్మాల్యా నేరం ఒక్కటే అన్నారు. రామలింగరాజుకు శిక్ష పడినట్లే, సెక్షన్ 477–ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేశారు. రామోజీరావుకు పారదర్శకత ఉంటే.. డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే.. రామోజీరావు పత్రికాస్వేచ్ఛపై దాడి అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.
మొండోడు జగన్..
రామోజీరావు అక్రమాలపై తాను 2010లోనే కోర్టులో కేసు వేశానని తెలిపారు. నాటి నుంచి రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. కానీ, వీరెవరూ రామోజీని టచ్ చేసే సాహసం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మొండోడు కావడంతో రామోజీ అవినీతిని బయటపెడుతున్నారన్నారు. నాకు మద్దతుగా కోర్టులో మార్గదర్శి అక్రమాలపై అఫిడవిట్ దాఖలు చేశాడని ఉండవల్లి అన్నారు. గతంలో ఆయా ముఖ్యమంత్రుల ఉన్నప్పుడు పోలీసులు రామోజీరావు ఇంటికి వెళ్లడానికి కూడా భయపడేవారన్నారు. ఆయన చెప్పిన సమయానికే విచారణ కోసం వెళ్లేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకడం లేదని తెలిపారు. ఏది ఏమైనా నేరం చేస్తే రామోజీని జైల్లో పెట్టాల్సిందే అని స్పష్టం చేశారు.