రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రతి జిల్లాకు ఐదు ఆసుపత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కోవిద్19 నియంత్రణకు సంబంధించిన చర్యలపై సీఎం జగన్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సహా, కోవిద్19 విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కరోనా నియంత్రణలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు అదనంగా ఐదు ఆసుపత్రుల చొప్పున గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. క్రిటికల్ కేర్ కోసం నాలుగు ప్రధాన ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలకు అదనంగా ఐదు ఆసుప్రతుల చొప్పున సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో సదుపాయాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. ఐసోలేషన్ లో ఉంచే వారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ పరీక్షలు చేయించాలని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.