ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ కనుగొనబడలేదు. ఈ వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. కోవిద్19 నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అందరినీ సంఘటితం చేస్తూ.. వ్యాక్సిన్ కనుగొనే పరిశోధనలను వేగవంతం చేసేలా ప్రోత్సహించినపుడే మహమ్మారిని నియంత్రించగలిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసం 2020 ఏడాది ముగిసే నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఉందన్నారు.
అదే విధంగా.. ఫలభరితమైన వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాగలిగే ఏకైక సాధనం అని, అదే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని, ట్రిలియన్ డాలర్ల ఖర్చును కట్టడి చేస్తుందని ఆంటోనియో పేర్కొన్నారు.
ఐరాస అనుబంధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేయడంపై ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తం చేసిన విషయం విదితమే. ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్న ఆయన.. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు