KCR- BJP: వణికించే చలిలో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడి పెంచుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. కానీ, మంత్రులు ఆపని చేయలేక పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఐటీ, ఈడీ దాడులు మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారికి కంటిమీద కునుకు కరువవుతోంది. ఎప్పుడు ఎవరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయో అర్థం కాని పరిస్థితిలో మంత్రులు ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న గేమ్లో, సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెలంగాణ మంత్రులు పావులుగా మారారు.

బీజేపీ మార్క్ షాక్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళతారని అంతా భావించారు. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మూడోసారి కూడా అధికారంలోకి రావాలని, ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు నియోజకవర్గాలపై ఫోకస్ చేద్దాం అనుకున్న మంత్రులను బీజేపీ తనదైన మార్కులో షాక్ ఇచ్చింది. మంత్రుల మైండ్ను డిస్టర్బ్, డైవర్ట్ చేసింది.
ఈడీ, ఐటీ దాడులు.. లిక్కర్ స్కాంలో కవిత పేరుతో టెన్షన్..
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులపై ఈడీ, ఐటీ దాడులతో ఒక్కసారిగా ఫోకస్ అంతా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల మీద ఉండేలా చేసింది. ఇక ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారని వెలుగులోకి వచ్చిన అంశాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని మంత్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. కవితను అరెస్ట్ చేసే దిశగా ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతోంది. దీంతో ఎవరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ అనవసరంగా బీజేపీతో తలనొప్పి పెట్టుకున్నాడా అని కొంతమంది గులాబీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఏమీ చేయలేక లోలోపల మధనపడుతున్నారు.
మంత్రుల మైండ్ డైవర్షన్లో బీజేపీ సక్సెస్..
టీఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్న నాయకులు, తమపై ఎప్పుడు ఏం దాడులు జరుగుతాయో అన్న ఆందోళనలో వచ్చే ఎన్నికలు తర్వాత, ముందు తమ ఆస్తులను కాపాడుకోవటం ఎలా అన్న దానిపై దృష్టి పెడుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులకు మైండ్ డైవర్ట్ చేసేలా బీజేపీ వ్యూహం ఫలించిందని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది భావిస్తున్నారు. ఇక బీజేపీని ఇరకాటంలో పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తున్నా, అది అంత సక్సెస్ కావడం లేదన్న అభిప్రాయం గులాబీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ కీలక నాయకులను అరెస్ట్ చెయ్యాలని భావించినా సిట్ అధికారులకు అది సాధ్యం కావటం లేదు. బీజేపీ నాయకులను ఇరికించటంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారని సొంతపార్టీ నేతలే పేర్కొటున్నారు.

అట్లుంటది బీజేపీతో..
ఇక బీజేపీకి చెక్ పేట్టేందుకు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతన్నాయి. ఒకవైపు బీజేపీ అగ్రనేతలను విచారించాలన్న వ్యూహం బెడిసి కొట్టగా, మరోపైపు సంజయ్ యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చి టీఆర్ఎస్ సర్కార్కు షాక్ ఇచ్చింది. బండి సంజయ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. మరోవైపు వైఎస్.షర్మిల కూడా పాదయాత్ర చేస్తూ సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్పై పోరాటంలో ప్రతి పక్షాలు బలంగా ముందుకు వెళుతుంటే, టీఆర్ఎస్ నాయకులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విషయం మరిచిపోయి ఐటీ, ఈడీ దాడుల గొడవలో పడిపోయారు. మొత్తంగా బీజేపీ ఇస్తున్న షాకులతో కేసీఆర్కు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీతో, మోదీతో పెట్టుకుంటే ఎట్లుంటదో ఇప్పటికైనా కేసీఆర్కు అర్థమై ఉంటుందని గులాబీ నేతలతోపాటు, బీజేపీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.