సిఎం కేసీఆర్ సంకల్పం మేరకే రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు శర వేగంగా జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. 80 డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి అందజేసిన సందర్భంగా మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నాణ్యతలో ఎలాంటి రాజీ పడలేదని, డబుల్ బెడ్ రూం లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లపై సమీక్ష నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, పెండింగ్ లో ఉన్న అన్ని ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని కేటిఆర్ చెప్పారు.