Parliament Elections 2024 : దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ ఎవరో తెలుసా? లెక్కలివీ

- లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌.. 1977లో బిహార్‌లోని హజీపుర్ నుంచి పోటీ చేసి 89 శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం.

Written By: NARESH, Updated On : June 3, 2024 9:46 pm

Do you know the MP who won with the highest majority in the country?

Follow us on

Parliament Elections 2024 : ఎన్నికల్లో గెలవడం అంటేనే ఓ కిక్కు. కొంత మందికి భారీ మెజారిటీ వస్తుంది.. కొందరు తృటిలో ఓటమి నుంచి బయటపడతారు. మరి కొన్ని గంటల్లో 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. కేంద్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కఠకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ, తక్కువ ఓట‍్లతో గట్టెక్కేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు భారీ మెజారిటీ సాధించిన ఎంపీలు, సింగిల్‌ డిజిట్‌తో బయటపడిన అభ్యర్థుల గురించి తెలుసుకుందాం.

ప్రీతమ్ ముండే రికార్డు విజయం..
దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేతగా బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే చరిత్ర సృష్టించారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె రికార్డు విజయం సాధించారు. కేంద్రమాజీ మంత్రి, మహారాష్ట్ర బీద్ ఎంపీ గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడి నుంచి ఆయన కుమార్తె ప్రీతమ్ పోటీ చేయగా… రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

గత ఎన్నికల్లోనే నలుగురు..
ఇక ప్రీతమ్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు 6 లక్షలకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. వీరు కూడా బీజేపీ నాయకులే.

– గుజరాత్‌లోని నవసరి నియోజకవర్గం నుంచి బీజేపీనేత సీఆర్.పాటిల్ 6.89 లక్షల మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు.

– హరియాణాలోని కర్నాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సంజయ్ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ గుజ్జర్ 6.38 లక్షల తేడాతో గెలిచారు.

– రాజస్థాన్‌లోని భిల్వాడా లోక్‌సభ స్థానం నుంచి సుభాష్ బహేరియా 6.12 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

– 2004లో సీపీఎం నేత అనిల్‌బసు ఆరంబాఘ్(పశ్చిమ బెంగాల్) లోక్‌సభ స్థానం నుంచి 5.92 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.

తక్కువ మెజారిటీతో..
భారీ మెజారిటీ దక్కిందంటే అక్కడ వార్‌ వన్‌సైడ్‌ అయినట్లే. అయితే కొన్నిసార్లు ప్రత్యర్థుల మధ్య విజయం దోబూచులాడుతుంది. చివరకు అత్యల్ప మెజార్టీతో గట్టెక్కాల్సి వస్తుంది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు కేవలం 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.

– 1989లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ తన సమీప అభ్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

– 1998లో బిహార్‌లోని రాజ్మహల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ నేత సోమ్ మారండి కూడా కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

– 1996లో గుజరాత్‌లోని బరోడా స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత గైక్వాడ్ సత్యజిత్ సిన్హా 17 ఓట్ల తేడాతో నెగ్గారు.

– 1971లో తమిళనాడులోని తిరుచెందూర్‌ నుంచి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ఎంఎస్.శివస్వామికి 26 ఓట్ల తేడాతో విజయం వరించింది.

– 2014లో లద్దాఫ్ స్థానం నుంచి బీజేపీ నేత తుప్తోన్ చెవాంగ్ 36 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. 1962లో ఔటర్ మణిపుర్ స్థానం నుంచి రిషాంగ్ (మణిపుర్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీ) 42 ఓట్లతో నెగ్గారు.

– 2004లో లక్షద్వీప్ నుంచి పోటీ చేసిన పోకునికోయ 71 ఓట్లు, 1980లో యూపీలోని దేవరియా నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీకి చెందిన రామాయణ్ రాయ్ 77 ఓట్ల తేడాతో గెలుపొందారు.

90 శాతానికిపైగా ఓట్లతో..
ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోటీలో ఉన్న అభ్యర్థులు షేర్‌ చేసుకుంటారు. ఎక్కువ ఓట్ల శాతం ఎవరికి వస్తే.. వారినే విజయం వరిస్తుంది. ఇలా పోలైన ఓట్లలో కొందరు 90 శాతం, అంతకంటే ఎక్కువ ఓట్లతో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన ఎంపీలూ ఉన్నారు. 1989లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ స్థానం నుంచి పీఎల్ హండూకు(జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ) ఏకంగా 98 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఈ స్థానంలో 7.36 లక్షల ఓటర్లుండగా.. కేవలం 5 శాతం మంది అంటే 37,377 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 36,055 మంది హండూకే పోలయ్యాయి. నాడు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో మెజారిటీ విజయం దక్కింది.

– ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో నంద్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని) లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 89.5 శాతం ఓటు షేరు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టలేదు.

– లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌.. 1977లో బిహార్‌లోని హజీపుర్ నుంచి పోటీ చేసి 89 శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం.