రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్ల పంపిణీ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్క్ల వల్ల కొంత రక్షణ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని సీఎం కు వివరించారు. 32,349 మందిని వైద్యాధికారులకు ఎన్ఎంలు, ఆశావర్కర్లు రిఫర్ చేసినట్లు చెప్పారు. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల కోవిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వివరించారు.
కోవిడ్ వ్యాప్తి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వీరిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బంది వరకూ చేరవేయాలని సూచించారు. ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు.
అలాగే నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా చేయాలని కోరారు. ఎక్కడా కూడా జనం గమిగూడ కుండా ఉండాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమెదైన కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరిస్తూ…మొత్తం నమోదైన కేసులు 417, వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12, ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్ కేసులు 199, వారిద్వారా సోకిన వారు 161, మిగిలిన పాజిటివ్కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల వ్యాధి సోకిన వారు, వారి ద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారని తెలిపారు.