Site icon OkTelugu

Mudragada Padmanabham: ముద్రగడను పరామర్శించని జగన్.. ఏమైంది.. ఏం జరుగుతోంది..

Mudragada Padmanabham

Mudragada Padmanabham

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి మాత్రం ఎవరికీ మింగుడు పడటం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో పరితపించారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేశారు ఈ నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం తన కాపు నాయుడు పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఆరాధించారో ఇట్టే అర్థం అవుతోంది. అటువంటి ముద్రగడ అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే… కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో ప్రత్యేక వీడియో బైట్ ఇప్పించారు. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది.

* కాపు ఉద్యమ నేతగా..
ముద్రగడ పద్మనాభం రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు సమకాలీకుడు. వారిద్దరితో పాటు 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు ముద్రగడ. మంత్రిగా, ఎంపీగా కూడా పదవులు చేపట్టారు. రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉండాల్సిన ఆయన.. ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. అప్పటినుంచి మనస్థాపానికి గురై క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగా.. ఆయనకు వ్యతిరేకిగా ముద్ర పడిన ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ప్రయోజనం చేకూర్చింది అని చెప్పే దానికంటే.. జగన్మోహన్ రెడ్డికి టర్నింగ్ పాయింట్ అయింది. అందుకే జగన్ ప్రయోజనాల కోసం ముద్రగడ పనిచేశారు అన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు ముద్రగడ.

* దక్కని ప్రాధాన్యం..
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ముద్రగడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన క్రమంలో వైసీపీని గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేశారు. అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. అలా రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది కూడా. అయితే ఇంతలా పరితపించిన ముద్రగడ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో అనారోగ్యానికి గురయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఆయన రాకపోగా ముద్రగడ కుమారుడు తో ప్రత్యేక వీడియో చేయించారు. తమకు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయన వస్తామంటే వద్దన్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎందుకు వద్దంటారు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఏది ఏమైనా ముద్రగడ లాంటి నేతలను జగన్ పరామర్శించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

Exit mobile version