Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారా? బీజేపీ హైకమాండ్ ఇచ్చిన టాస్కును ప్రారంభించారా? పాత కాపులనంత చేరదీస్తున్నారా? వారిని ఒడిసి పట్టి కమళం గూటికి చేర్చాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కలం కలిసిరాక చాలా మంది హేమాహేమీ నాయకులు అదును కోసం వేచిచూస్తున్నారు. 2024 ముందు ఏ పార్టీలో చేరుతామా? అన్న మిమాంసలో నలుగు రోడ్ల జంక్షన్ లో నిలబడి ఉన్నారు. వారంతా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సహచరులే. ఆయన కేబినెట్ లో పనిచేసిన వారే. అందుకే వారిని బీజేపీకి దగ్గర చేసేందుకు కిరణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేరుగా కిరణే ఆహ్వానం పంపేసరికి సదరు నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ నాయకులపై ఫోకస్..
కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన చాలా మంది నాయకులు ప్రస్తుతం పొలిటికల్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. అందులో మాజీ పీసీసీ చీఫ్ లు అయిన రఘువీరారెడ్డి సాకే శైలజానాథ్, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, గోదావారి జిల్లాలకు చెందిన కేంద్ర మంత్రి పల్లం రాజు,మాజీ ఎంపీ జి హర్షకుమార్ వంటి వారికి బీజేపీలోకి రప్పించేందుకు కిరణ్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అదే కానీ జరిగితే బీజేపీకి కొత్త జోష్ వచ్చినట్టే. ఇప్పటికే బీజేపీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు.
యాక్టివ్ వెనుక…
అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక ఏదో వ్యూహం ఉంది. కానీ అది బయటపడడం లేదు. బీజేపీలో చేరిన తరువాత ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. అటు జిల్లాల టూర్లకు సైతం సిద్ధపడుతున్నారు. ఉమ్మడి ఏపీకి కిరణ్ చివరి మూడేళ్లు సీఎంగా పనిచేశారు. పాలనాపరంగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అటు కేబినెట్ లోని మంత్రులు సైతం ఆయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు అప్పట్లో పనిచేసిన మంత్రులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన తన పాత పరిచయాల ద్వారా అన్ని పార్టీల్లో ఉన్న నాయకులను చేరదీసే పనిలో పడ్డారు. అయితే అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.
సక్సెస్ అయ్యేరా?
రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పల్లంరాజు, హర్షవర్థన్, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి వారు రాజకీయంగా సైలెంట్ అయినా.. వారి ముద్ర మాత్రం వారి సొంత జిల్లాల్లో ఉంది. వారిని కానీ ఆకర్షించగలిగితే ఆ జిల్లాలో బీజేపీ బలోపేతం అయ్యే చాన్స్ ఉంది. అందుకే కిరణ్ ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. తనకంటూ ఒక సొంత టీమ్ ను ఏర్పాటుచేసుకుంటే బీజేపీ హైకమాండ్ గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందని కిరణ్ వర్గం భావిస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీలో హేమాహేమీలు ఉన్నారు. వర్గాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కిరణ్ ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమవుతుందో చూడాలి మరీ.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More