Site icon OkTelugu

AP Politics: హస్తినలో ఏపీ పొలిటికల్ గేమ్

AP Politics

AP Politics

AP Politics: ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. విపక్ష నేత చంద్రబాబు పర్యటన ఇలా ముగిసిందో లేదో.. సీఎం జగన్ ఢిల్లీలో వాలిపోయారు. వరుసగా ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. దీంతో ఇది రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో ఎన్నడూ ఈ పోటీ పర్యటనలు జరగలేదు. ఇప్పటివరకు జగన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర పెద్దలు.. ఇప్పుడు చంద్రబాబును ప్రత్యేకంగా పిలిచి మాట్లాడడం మారిన రాజకీయాలకు అద్దం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట కొత్త సమీకరణలకు కారణం అవుతోంది.

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాని మోదీతో సమావేశం ఖరారు అయినా.. హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ విషయం ఎటూ తేల లేదని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధుల విడుదల, విభజన హామీలు వంటి వాటిపై ప్రధానితో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటన పూర్తిగా పాలనాపరమైనదా? లేకుంటే రాజకీయాల కోసం చర్చిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడంతో.. సీఎం జగన్ ప్రధానితో మరోసారి ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది.

మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిగానే.. సీఎం జగన్ అక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండడంతోనే చంద్రబాబు పొత్తు కోసం పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటన కేవలం రాజకీయాల కోసమేనని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తేల్చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకో వైపు టిడిపితో బిజెపి పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని బిజెపి నాయకుడు సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. అయితే ఏపీ రాజకీయాలు హస్తినబాట పట్టడం ఢిల్లీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందరి దృష్టి ఏపీపై పడింది. ఢిల్లీ కేంద్రంగా పొలిటికల్ గేమ్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version