Chandrababu Jail
Chandrababu Jail: అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టు అయి 43 రోజులు అవుతోంది. కోర్టుల్లో ఊరట దక్కడం లేదు. కనుచూపుమేరలో జైలు నుంచి విముక్తి కలిగే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. పండుగలు దాటుతున్నా అధినేత మాత్రం బయటికి రాకపోవడంతో వారు పడుతున్న వ్యధ అంతా కాదు. చివరకు వారు సైతం పండుగలు చేసుకోవడం లేదు.
ఇప్పటికే వినాయక చవితిని చంద్రబాబు చేసుకోలేకపోయారు. అప్పటికే ఆయన జైల్లో ఉన్నారు. ఈ దసరా కూడా చేసుకునే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడించలేదు. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసు బెయిల్ పిటిషన్ పై తీర్పును సైతం సుప్రీంకోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది. ఈ లెక్కన క్వాష్ పిటీషన్ పై తీర్పు కూడా జాప్యం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే దసరా సైతం చంద్రబాబు జైలు గోడల మధ్య జరుపుకోవాల్సి ఉంటుంది. పోనీ నవంబర్లో జరిగే పండుగలకైనా చంద్రబాబుకు విముక్తి కలుగుతుందా? లేదా? అన్నది తెలియడం లేదు.
సందట్లో సడేమియా అన్నట్టు 17a సెక్షన్ పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలయ్యింది. నవంబర్ 15న ప్రముఖ న్యాయవాది, న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 17a ఉనికి మీదనే ఈ పిల్ దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ సమ్మతం కాదని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అవినీతి కేసులో ప్రభుత్వ అధికారి పై దర్యాప్తు ప్రారంభించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసే 17 ఏ సెక్షన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలయింది. ప్రస్తుతం చంద్రబాబు కేసు విషయంలో 17 ఏ సెక్షన్ చుట్టూ వాదనలు జరుగుతుండడంతో.. ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ అడ్డంకిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చంద్రబాబు నెలల తరబడి అరెస్టు కావడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అసలు చంద్రబాబు అరెస్టు కారని భావించారు. ఒకవేళ అరెస్ట్ అయినా గంటల వ్యవధిలో బయటకు వస్తారని అంచనా వేశారు. కానీ రోజులు, వారాలు, నెలలు దాటుతున్నాయి. పండుగలు సైతం ముందుకు సాగుతున్నాయి. కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఊరట దక్కడం లేదు. అసలు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో తెలియడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ షాక్ లో ఉంది. ఎప్పుడు ఉపశమనం లభిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది.