Bandi Sanjay: దళిత ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోడీకి , సీఎం కేసీఆర్ కు తేడా చెప్పి మరీ ఉతికి ఆరేశాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్. మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోని దళితులందరికీ నరేంద్రమోదీగారు ఆత్మబంధువు. అంబేద్కర్ ను దైవంగా భావిస్తున్న నేత. అంబేద్కర్ భిక్ష వల్లే నేను ప్రధాని అయ్యానని పార్లమెంటు సాక్షిగా చెప్పిన గొప్ప నాయకుడన్నారు. అదే సమయంలో మన తెలంగాణలో కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించారు. నరేంద్రమోదీ వచ్చాక దళితుల గౌరవాన్ని పెంచేందుకు, ఆర్దికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు పారిశ్రామివేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ఎన్నో స్కీంలను తీసుకొచ్చారు. ఇప్పటిదాకా బ్యాంకు మెట్లు ఎక్కని దాదాపు 3 కోట్ల మంది దళితులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా ఆ నగదు లబ్దిని వారి ఖాతాల్లోనే జమ అయ్యేలా చేశారు.దళితులు ఉద్యోగాలు అడిగేవాళ్లు కాకూడదు.. లైన్లో నిలబడే వాళ్లు కాకూడదు… ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎధగాలని అర్హులైన దళితులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు లోన్లు ఇచ్చే గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు.మోదీ దళిత యువకులు ఉన్నత విద్యను అభ్యసించాలే… విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నరు. ఇంతకు ముందు ఏటా 50 మంది దళిత విద్యార్థులను మాత్రమే విదేశాలకు పంపితే.. ఇప్పుడు ఏకంగా 500 మందికి స్కాలర్ షిప్పులిచ్చి విదేశాలకు పంపుతోంది.

ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా బ్యాంకులు సహకరించవు… ఇది గమనించే దేశంలోని 1 లక్షా 25 వేల బ్రాంచీల్లో ప్రతి ఏటా ఒక్కరికైనా ఈ పథకం కింద లోన్ ఇవ్వాలని కచ్చితమైన రూల్ తీసుకొచ్చింది. దీనిద్వారా ఏటా 1 లక్షా 25 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నరని అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ
రాజగోపాల్ రెడ్ గెలిస్తే మునుగోడు యువకులకు కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటది.
• కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను దారుణంగా అవమానించింది. దళితుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రశ్నిస్తే నెహ్రూ కుదరదన్నడు.. అప్పుడు ఇట్లయితే రాజీనామా చేస్తానని అంబేద్కర్ హెచ్చరించిండు.. అయినా రాజీనామా చేస్తే చేసుకోపో… అని నెహ్రూ అంటే.. తక్షణమే రాజీనామా చేసి బాబాసాహెబ్ ఉప ఎన్నికల్లోకి వెళితే.. ఎవరో అనామకుడిని నిలబెట్టి ఎన్నో కుట్రలు, కుతంత్రలు చేసి అంబేద్కర్ ను ఓడించిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ దే.
• బతికున్నప్పుడు పార్లమెంట్ లో అవమానించారు. ఎన్నికల్లో ఓడించి అవమానించారు. ఆఖరుకు చనిపోయిన తరువాత కూడా అంబేద్కర్ డెడ్ బాడీని ఢిల్లీలో పెడితే.. అక్కడ స్మ్రుతి స్థలం కట్టాల్సి వస్తుందని డెడ్ బాడీని ముంబయికి పంపించి దారుణంగా అవమానించారు.
• నరేంద్రమోదీగారు అంబేద్కర్ ను దైవంతో సమానంగా చూస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ జీవితంతో అనుబంధం ఉన్న 5 స్థలాలను పంచ తీర్థాలుగా అభివ్రుద్ధి చేశారు. ఆయన జ్ఝాపకాలు వందల ఏళ్ల వరకు భవిష్యత్ తరాలకు గుర్తుండాలని మోదీగారు ఈ గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు.
• అంబేద్కర్ పుట్టిన ఊరు మధ్యప్రదేశ్ లోని ‘‘మావు’’ను గొప్ప స్మారక కేంద్రంగా మార్చారు. ఆయన లండన్ లో చదువుకునేటప్పుడు ఉన్న ఇంటిని వందల కోట్లు ఖర్చు పెట్టి మ్యూజియంగా మార్చారు. నాగ్ పూర్ లోని అంబేద్కర్ దీక్షా స్థల్ ను గొప్పగా తీర్చిదిద్దారు. ముంబయిలో అంబేద్కర్ గారి ఘాట్ ను గొప్ప స్మ్రుతి స్థల్ గా తీర్చిదిద్దారు. ఢిల్లీలో అతిపెద్ద అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

• మోడీగారు ఈ ఐదు పంచ్ తీర్థాలను దివ్య క్షేత్రలుగా రూపొందించి భావితరాలకు ఆదర్శంగా నిలిపారు.
• ఇక్కడ కేసీఆర్ అడుగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూనే ఉన్నడు. ముఖ్యంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తనన్నడు.. ఎందుకంటే దళితుడి పేరును పదేపదే ఉచ్చరించడం ఇష్టంలేక తానే కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తానంటున్నడు.
• అన్నింటికి మించి సీఎంఓలో దళిత అధికారులను దగ్గరకు కూడా రానీయ్యలే. గొప్ప గొప్ప ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీరని అవమానం చేసిండు. వాళ్లెవరో మీకు తెలుసు… యావత్ సమాజం థూ.. అని ఊస్తే.. ఈ మధ్య సీఎంఓలో ఒక దళిత అధికారిని పెట్టుకున్నడు.
• కేంద్రం ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నడు. కానీ డబ్బుల్లేకపోవడంవల్ల ఎస్సీల్లోని ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ టెన్త్, ఇంటర్ దగ్గరే చదువు ఆపేస్తున్నరు. ఇట్లా ఎవరూ చదువు మధ్యలో ఆపొద్దని 59 వేల కోట్లతో మెరిట్ స్కాలర్ షిప్ నిధిని మోదీగారు కేటాయించారు. ఈ స్కీం ప్రకారం ఒక్కో స్టూడెంట్ కు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వాలి. కానీ కేసీఆర్ కు ఆ 40 శాతం నిధులు ఇవ్వడం చేతగాలేదు.. పైగా కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులు నాకే నేరుగా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తుండు.. ఎందుకంటే ఆ డబ్బును కూడా నాకి పారేయాలని చూస్తున్నడు..
• ఈయన చిల్లర బుద్ది మోదీగారికి తెలుసుకు కాబట్టి… 60 శాతం కాదు 80 శాతం నిధులిస్తా… కానీ రాష్ట్ర వాటా 20 శాతం ఇస్తే చాలని చెప్పినా… కేసీఆర్ మాత్రం ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం చేతగావడం లేదు. దీంతో వేలాది మంది దళిత బిడ్దలకు ఈ స్కాలర్ షిప్పులు అందడం లేదు.. లేకపోతే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎండీ వంటి ఉన్నత చదువులను ఒక్క పైసా ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం వచ్చేది.
• బీజేపీకి రాష్ట్రపతిని చేసేందుకు 3 సార్లు అవకాశమొచ్చింది ఇప్పటి వరకు… తొలిసారి మైనారిటీ అయిన అబ్దుల్ కలాంగారికి, రెండోసారి రామ్ నాథ్ కోవింద్ గారికి, మూడోసారి గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన గొప్ప పార్టీ బీజేపీ.
• దేశ చరిత్రలో 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులుగా చేసి దళిత జాతి గౌరవాన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తి మోదీగారు. 4గురిని గవర్నర్లుగా, ఎంతోమందిని రాజ్యసభ సభ్యులుగా, ఎంపీలుగా అవకాశమిచ్చిన గొప్ప పార్టీ బీజేపీ.
• కేసీఆర్ మాత్రం దళితుడిని సీఎం చేస్తానని హమీ ఇచ్చి మాట తప్పిండు… ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చి కారణాలు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దళితులకు మూడెకరాలు.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్ కు నిధులివ్వడం లేదు..
• ఇప్పుడు నేను అడుగుతున్నా… కేసీఆర్ నీ మొదటి కేబినెట్ లో ఎంతమంది దళితులకు అవకాశమిచ్చావ్? ఎస్సీ కమిషన్ నియమించకుండా చాలాకాలం ఎందుకు జాప్యం చేసినవ్?
• నీకు దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయ్… కొత్త సెక్రటేరియట్ లో కొత్త ఛైర్ లో దళితుడిని సీఎంగా కూర్చోబెట్టాలని సవాల్ చేస్తున్నా అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
— * బీజేపీలో చేరిన పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు
నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీలో చేరారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ వీరికి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది పసుపు రైతులు వీరిలో ఉన్నారు. వీరితోపాటు దాదాపు 900 మంది రైతులు ఈరోజు బీజేపీలో చేరినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.