తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి 6, అసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఏడుగురు కరోనా రోగులు ఈ రోజు మరణించారు. మరో ఇద్దరు వలస కూలీలు కరోనా బారినపడ్డారు.
తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు పేషెంట్లకు ప్లాస్లా థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీని ద్వారా మెరుగైన ఫలితాలు సంభవిస్తాయని అధికారులు చెప్పారు. వీరు క్రమంగా కోలుకుంటున్నారని.. ఒకరు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారని బులెటిన్ లో పేర్కొన్నారు.
కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ ద్వారా ఇతర దేశాల నుంచి తెలంగాణకు 458 మంది భారతీయులు వచ్చారు. వారిని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి కరోనా పరీక్షలు చేయగా.. 212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో 206 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.