Congress Vs BJP: కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ.. రాహుల్ టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై మాటల మంటలు

దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఇటీవల బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మోదీకి లేఖ రాశారు. ఇక ఈ లేఖలో చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. కాంగ్రెస్‌ నేతలు మోదీపై చేసిన వ్యాఖ్యలను పేర్కొంటో బీజేపీ చీఫ్‌ నడ్డా మరో లేఖ రాశారు.

Written By: Raj Shekar, Updated On : September 20, 2024 1:37 pm

Congress Vs BJP

Follow us on

Congress Vs BJP: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేపట్టిన అమెరికా పర్యటన దేశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. అమెరికా వెళ్లిన రాహుల్‌ అక్కడ విద్యార్థులతో సమావేశమై.. దేశంలో రిజర్వేషన్ల రద్దు, ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పరాయి దేశంలో భారత్‌ను కించపర్చేలా మాట్లాడడాన్ని తప్పు పట్టారు. ఇదే సమయంలో భారత వ్యతిరేక సెనెటర్‌ను రాహుల్‌ కలవడంపై మండిపడ్డారు. రాహుల్‌ను టెర్రరిస్టుగా అభివర్ణించారు. రాహుల్‌ నాలుక కోసినవారికి రూ.11 లక్షల నజరానా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీ నేతల మాటలను తప్పుపడుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అధికార పార్టీ నేతల మాటలు హింసాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై చర్య తీసుకోవాలని కోరారు. నేతలను క్రమశిక్షణలో పెట్టాలని పేర్కొన్నారు. వ్యక్తిగత ధూషణలు రాజకీయాలకు మంచిది కాదని పేర్కొన్నారు.

ఖర్గే వ్యాఖ్యలను తిప్పకొట్టిన నడ్డా..
మోదీకి రాసిన లేఖలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా తిప్పి కొట్టారు. కాంగ్రెస్‌ నేతలు గడిచిన పదేళ్లలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ లేఖ విడుదల చేశారు. ఇదే సమయంలో రాహుల్‌ భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారని ఖర్గేను ప్రశ్నించారు. భారత వ్యతిరేక శక్తులకు రాహుల్‌ అండగా నిలిచారని ఆరోపించారు. ప్రధానితోపాటు వెనుకబడిన తరగతులను దొంగ అని సంబోధించిన చరిత్ర కాంగ్రెస్‌దని పేర్కొన్నారు. మోదీని కాంగ్రెస్‌ నేతలు 110సార్లు ధూషించారని తెలిపారు. ‘మీ వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మీరు, గాంధీ, ఇతర నాయకుల దుర్మార్గాలను మరచిపోయినట్లు లేదా ఉద్దేశపూర్వకంగా వాటిని విస్మరించినట్లు మీ లేఖ ద్వారా తెలుస్తోంది‘ అని నడ్డా పేర్కొన్నారు.

లేఖల్లో ఇద్దరు నేతలు ఇలా..
ఖర్గే రాసిన లేఖలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కేంద్ర మంత్రి, మంత్రి గాంధీని నంబర్‌ వన్‌ టెర్రరిస్టు అని అనడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత నాలుక కోసిన వ్యక్తికి శివసేన ఎమ్మెల్యే రూ.11 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్‌ పడుతుందని మరో నేత పేర్కొన్నాడని వెల్లడించారు. జేపీ నడ్డా తన లేఖలో రాహుల్‌గాంధీ మోదీని గతలో లాఠీతో కొట్టండని మాట్లాడారని, సోనియాగాంధీ మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘మౌత్‌ కా సౌదాగర్‌‘ అని పిలిచారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్‌ నాయకులు మోడీని అవమానించినంతగా ఏ నాయకుడిని అవమానించలేదని నడ్డా ఆరోపించారు,

భారత్‌లో విదేశీ జోక్యాన్ని సమర్థిస్తారా..
ఇక భారత వ్యతిరేక, పాక్‌ అనుకూల శక్తులతో రాహుల్‌ కలవడాన్ని మీరు సమర్థిస్తారా అని నడ్డా ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నందున గాంధీని చూసి కాంగ్రెస్‌ గర్వపడుతుందా అని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ పదే పదే హిందూ సనాతన సంస్కృతిని అవమానించారని, సాయుధ బలగాల ధైర్యసాహసాలకు సాక్ష్యాలను వెతకాలని, సిక్కుల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శామ్‌ పిట్రోడా, శశి థరూర్, దిగ్విజయ్‌ సింగ్, పి చిదంబరం, కె.సురేష్, ఇమ్రాన్‌ మసూద్‌ వంటి కాంగ్రెస్‌ నేతల పేర్లను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ నేతలు దేశం పరువు తీయడానికి అంతా చేశారని నడ్డా పేర్కొన్నారు.