Congress Manifesto: ఎలాగైనా అధికారంలోకి రావాలి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర అనంతరం దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కాంగ్రెస్ .. పదేళ్ల క్రితం వరకు అధికారంలో కొనసాగింది. అనేక రాష్ట్రాలను పరిపాలించింది. నాడు ఘనం.. నేడు అధ్వానం అనే సామెత తీరుగా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల నుంచి పోల్చి చూస్తే ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి క్రమంలోనే ఆ పార్టీ ఐటీ లొసుగులు ఇటీవల వెలుగు చూసాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అనివార్యత కాంగ్రెస్ పార్టీది. అందువల్లే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మేనిఫెస్టో రూపొందించింది.
ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తామనే దానిమీద చాలావరకు రాజకీయ పార్టీలు దృష్టి పెడుతుంటాయి. గంపగుత్తగా ఓట్లను దక్కించుకునేందుకు ఆకర్షణీయమైన హామీలను తెరపైకి తెస్తుంటాయి. అలాంటి మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది. ఈ మేనిఫెస్టోలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఒక హామీని ఇచ్చింది.. ఆ హామీని కనుక ప్రజలు నమ్మితే ఇండియా కూటమిలో ఎటువంటి పార్టీల అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదు. అంతేకాదు ప్రతి మహిళ ఈ హామీని గనక నమ్మితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయగలదు. కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో ఉన్న హామీ ప్రకారం.. దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు చెల్లిస్తారట. అంటే స్థూలంగా నెలకు 8,500. అంత మొత్తంలో నగదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిన్న స్థాయి ఉద్యోగి సంపాదించే మొత్తం అది. కేవలం ఆడవారిగా పుట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో నజరానా ఇస్తుందన్నమాట.
ఈ హామీలో చిన్నపాటి తిరకాసు ఉంది.. పేదింటి ఆడవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారట. అంటే తెల్ల రేషన్ కార్డుతో ఈ పథకాన్ని అనుసంధానం చేస్తారని సమాచారం. అయినప్పటికీ ఇది చాలా పెద్ద హామీగానే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. ఈ హామీని గనక అమలు చేస్తే ప్రభుత్వం మీద ప్రతి ఏడాది లక్షల కోట్ల భారం పడుతుంది..మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా అదే విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పథకాలు ప్రకటించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ ఈ సమయంలో అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలు కనీసం ఆ దిశగా ఆలోచించేందుకు భయపడే పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకం మాత్రమే కాదు, చాలా వరాలు ప్రకటించింది. అయితే వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా వెల్లడించింది. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. ఈ హామీలను ఏం చేస్తుందనేది అసలు ప్రశ్న. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆ హామీ నుంచి కచ్చితంగా తప్పించుకుంటుంది. అలాంటప్పుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడే కూటమి పార్టీలతో కలిసి ఆ కార్యక్రమం చేపడితే బాగుండేది. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. అలాంటప్పుడు సొంతంగా ఎందుకు మేనిఫెస్టో విడుదల చేసిందనే ప్రశ్నకు.. కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం లేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More