Conferred IAS: రెడ్డి అధికారులకే ఐఏఎస్ హోదా.. ఇదీ జగన్ ‘కుల’భావం

గత ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్ కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లు జగన్ విమర్శించారు. డీఎస్పీల పదోన్నతుల్లో కమ్మ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చారని ఏకంగా ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్ లో ఆరోపణలు చేశారు.

Written By: Dharma, Updated On : November 9, 2023 1:42 pm

CM Jagan

Follow us on

Conferred IAS: సీఎం జగన్ నోరు తెరిస్తే నా ఎస్సీలు,నా ఎస్టీలు, నా బీసీలు అని చెబుతుంటారు. తన హయాంలో సామాజిక సాధికారిక సాధించాలని గొప్పగా ప్రకటనలు చేస్తుంటారు. కానీ పదవులే వెనుకబడిన వర్గాలవి.. పవర్ అంతా తన సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టారన్న అపవాదు ఉంది. సొంత సామాజిక వర్గం.. అందులోనూ తమ కుటుంబానికి దగ్గరైన రెడ్డి వర్గం మాత్రమే ఆయనకు కనిపిస్తుందన్న కామెంట్స్ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఇద్దరు రాష్ట్ర అధికారులకు కన్ఫర్డ్ఐఏఎస్ గా గుర్తింపు ఇవ్వడం విశేషం.

గత ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్ కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లు జగన్ విమర్శించారు. డీఎస్పీల పదోన్నతుల్లో కమ్మ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చారని ఏకంగా ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్ లో ఆరోపణలు చేశారు. కానీ తరువాత అదే వైసిపి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన డిఎస్పి పదోన్నతుల్లో సామాజిక వర్గాల వారీగా జాబితాను ప్రకటించింది. ఎన్నికల ముందు జగన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. నాడు చేసిన ఆరోపణలన్నీ రాజకీయాల్లో భాగమేనని అందరికీ అర్థమైంది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా ఒకే సామాజిక వర్గం వారు నియమితులు కావడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం నియామకాల్లో సైతం ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. టీటీడీ అధ్యక్షుడి నుంచి కొండ దిగువున అధికారి వరకు.. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. నామినేటెడ్ పదవుల్లో.. లాభదాయకమైన పోస్టుల్లో సైతం వారికి అగ్రస్థానం. బదిలీలు, పదోన్నతుల్లో సైతం వారికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నా పట్టించుకునే వారు లేక పోతున్నారు.

ఇప్పుడు తాజాగా కన్ఫర్డ్ ఐఏఎస్ గా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం అధికారులను గుర్తించడం వివాదాస్పదం అవుతోంది. ఎంతోమంది అధికారులు ఉన్నా.. అర్హత సాధించినా.. వారిని కాదని డాక్టర్ నీలకంఠారెడ్డి, భూమినేని అనిల్ కుమార్ రెడ్డిలను ఐఏఎస్లుగా ప్రమోట్ చేస్తూ డిఓపిటి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికార వర్గాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఇంకా అర్హత పొందిన అధికారులు లేరా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ ఈ ఇద్దరు అధికారులు జగన్ కు అస్మదీయులే. ఒకరు సీఎం ఓలో కీలక అధికారి అయిన ధనుంజయ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్.. మరొకరు పులివెందులకు మెట్రో చేస్తామని బిల్డప్ ఇచ్చి ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కు హెడ్. వీరి సర్వీసు ఐఏఎస్ స్థాయిలో లేదు. కానీ అస్మదీయులే కాబట్టి కన్ఫర్డ్ ఐఏఎస్ లుగా ఎంపిక చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ జమానాలో ఇంతేనంటూ అధికార వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. అటువంటప్పుడు ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలు ఎందుకని విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.